
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల (Punjab Assembly Elections) సమీపించిన తరుణంలో చండీగడ్ మేయర్ (Chandigarh Mayor) ఎన్నిక ప్రతీష్టాత్మకంగా మారింది. ముఖ్యంగా ఆప్(AAP), బీజేపీ(BJP)లు తీవ్రంగా పోటీ పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎన్నిక ఫలితం జోష్ను కొనసాగించవచ్చని భావించాయి. అందుకే ప్రతి ఓటు కీలకంగా మారింది. ఈ ఎన్నికలో ఆప్, బీజేపీ అభ్యర్థులకు సమాన ఓట్లు పడ్డాయి. కానీ, ఆప్ అభ్యర్థికి పడిన ఒక ఓటును ఎన్నికల అధికారులు చెల్లదని ప్రకటించారు. దీంతో బీజేపీ అభ్యర్థి గెలిచారు. కానీ, ఆప్ అభ్యర్థి మాత్రం తీవ్ర అభ్యంతరం తెలిపారు. సీనియర్ డిప్యూటీ, డిప్యూటీ మేయర్ సీట్ల ఎన్నికను అడ్డుకున్నారు. బీజేపీ అభ్యర్థి మేయర్ సీటు పొందడానికి ఆ రెండు ఎన్నికలనూ జరిపించాలి.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మేయర్ ఎన్నికపై బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలకు కీలకంగా మారాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. 35 సీట్లకు గాను ఆప్ పార్టీ 14 సీట్లను గెలుచుకుంది. కాగా, బీజేపీకి పరాభవం ఎదురైంది. అది దాని స్థానాలను 26 నుంచి 12 స్థానాలకు తగ్గించుకుంది. ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ మెరుగైన ప్రదర్శన కనబరచడంతో.. అదే ఊపును వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని భావించింది. కానీ, బీజేపీ మాత్రం తన స్తానాలు తగ్గడంతో మళ్లీ.. మేయర్ సీటు గెలుపొంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కార్యకర్తల్లో హుషారు తెప్పించాలని అనుకున్నది. అందుకే ఈ సీటుపై ఆప్, బీజేపీ ఫోకస్ చేశాయి.
చండీగడ్ మేయర్ ఎన్నికలో బీజేపీ, ఆప్ అభ్యర్థులు సమానంగా 14 ఓట్లు గెలుచుకున్నారు. బీజేపీకి 13 మంది కౌన్సిల్లరు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంపీ కిరణ్ ఖేర్ ఎక్స్ అఫీషియోగా బీజేపీకి ఓటు వేశారు. దీనితో 14 ఓట్లు బీజేపీకి దక్కాయి. కాగా, ఆప్ అభ్యర్థి అంజు కత్యాల్కు 14 ఓట్లు వచ్చాయి. కానీ, తర్వాత ఎన్నికల అధికారులు ఒక ఓటు చెల్లదని ప్రకటించారు. దీంతో బీజేపీ అభ్యర్థి సరబ్జిత్ కౌర్కు మెజారిటీ లభించింది. దీంతో ఆప్ కౌన్సిలర్లందరూ గెలిచిన అభ్యర్థి పక్కనే ధర్నాకు కూర్చున్నారు. మేయర్ ఎన్నికకు ఎంపీ ఓటు వేయరాదని ఆప్ కౌన్సిలర్లు వాదనలకు దిగారు. దీంతో ఎన్నిక అధికారి ఎంపీ ఓటు వేయడానికి వీలు కల్పిస్తున్న ఓ చట్ట కాపీని వారికి అందజేశారు.
కాగా, కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికకు దూరంగా ఉన్నది. తన ఏడుగురు కౌన్సిలర్లను ఈ ఎన్నికలో పాల్గొననివ్వలేదు. అకాలీ దళ్ ఒంటరి కౌన్సిలర్తో పాటు వీరు కూడా ఎన్నికకు దూరంగా జరిగారు. ఈ ఎన్నికకు కాంగ్రెస్ వ్యూహాత్మక దూరాన్ని పాటించింది. ఎందుకంటే.. బీజేపీని ఓడించాలని ఆప్ను బలపరిస్తే.. రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరోక్షంగా ఆప్ను బలోపేతం చేసినట్టవుతుంది. అదే బీజేపీకి సపోర్ట్ ఇస్తే రాష్ట్ర ప్రజలకు తప్పుడు సందేశం వెళ్లే ముప్పు ఉన్నది. అందుకే ఈ ఎన్నికలో కాంగ్రెస్ పాల్గొనలేదు.