గతంలోగా ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలి: నితీష్ కుమార్ మరికొత్త డిమాండ్  

By Rajesh KarampooriFirst Published Jan 21, 2023, 4:36 AM IST
Highlights

సాధారణ బడ్జెట్ నుండి ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను విడిగా ప్రవేశపెట్టాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. దీనికి చాలా ప్రాముఖ్యత ఉందని నితీశ్ అన్నారు.

సాధారణ బడ్జెట్ నుండి విడిగా ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. గతంలో రైల్వే బడ్జెట్‌ను ఎలా ప్రత్యేకంగా సమర్పించారో..అదే విధంగా సమర్పించాలని నితీశ్ కుమార్ కోరారు. సమాధాన్ యాత్రలో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం నలందలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ డిమాండ్ ను తెర మీదికి తెచ్చారు.  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగనున్నాయి.

తన పదవీకాలాన్ని గుర్తు చేసుకున్నారు

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 1998 నుండి 2001 వరకు రైల్వే మంత్రిగా వ్యవహరించారు. నలందలో నితీష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. తాను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చామనీ, పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు అన్ని పత్రికల్లో దానిపై ప్రత్యేక చర్చ జరిగేదని అన్నారు. ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టాలని కోరుతున్నాననీ, దానికి చాలా ప్రాముఖ్యత ఉందని తెలిపారు.
 
బీహార్‌కు ప్రత్యేక హోదా 

బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశాన్ని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి లేవనెత్తారు. బీహార్ షరీఫ్‌లో అభివృద్ధి పనులు జరిగాయని నితీశ్‌ కుమార్‌ అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ప్రజల సమస్యలు వింటూనే ఉన్నాననీ, తాను ప్రజల మధ్యకు వెళ్లి ప్రజలతో కూర్చుని వారి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

సుప్రీంకోర్టు తీర్పు అనుకూలం 

కుల ప్రాతిపదికన గణనపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ.. న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందని, ఇది అందరి శ్రేయస్కరమని అన్నారు. కుల ఆధారిత గణన అనేది కేంద్ర ప్రభుత్వ పని. రాష్ట ప్రభుత్వాలు చేస్తున్నాయని అన్నారు. గణనలో ప్రతి దాని గురించిన సమాచారం ఉంటుందనీ, కాబట్టి అభివృద్ధి పనులు పెంచడానికి సౌకర్యంగా ఉంటుందనీ, దీంతో ప్రజలు సులభంగా సహాయం పొందుతారని తెలిపారు. సమాధాన్ యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మొత్తం బీహార్‌లో పర్యటిస్తున్నారు. గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలను కలుస్తున్నారు.

రైల్వేల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టడం 1924 నుండి ప్రారంభమై..2017 వరకు కొనసాగింది. ఆ తర్వాత అది యూనియన్ బడ్జెట్‌లో విలీనం చేయబడింది. నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తడంతో రెండు బడ్జెట్ల విలీన ప్రణాళిక కోసం పార్లమెంటు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
 

click me!