
Bharat Bandh: ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ సర్కారు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రెండు రోజుల పాటు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, పోస్టల్, ఆదాయపు పన్ను, రాగి, బ్యాంకులు, బీమా వంటి వివిధ రంగాలకు చెందిన కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి.
రైతులతో సహా సామాన్య ప్రజలను ప్రభావితం చేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త బంద్ (సమ్మె)కు కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక పిలుపునిచ్చింది. బ్యాంకు ఉద్యోగులు కూడా నిరసనలో పాల్గొంటున్నందున, సోమ, మంగళవారాల్లో బ్యాంకింగ్ సేవలపై ప్రభావం పడుతోంది. దేశంలో ఉపాధి కరువవడం, పెరుగుతున్న నిరుద్యోగం, తక్కువ వేతనాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణ, బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు-2021 వంటి ఇతర సమస్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) తెలిపింది.
ప్రస్తుతం కొనసాగుతున్న భారత్ బంద్ లో INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF మరియు UTUCతో సహా కార్మిక సంఘాలు ఉమ్మడి ఫోరమ్లో భాగంగా ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంతో పాటు బీమా రంగ సంఘాలు కూడా భారత్ బంద్కు మద్దతు తెలిపాయి. ట్రేడ్ యూనియన్ల ప్రకటన ప్రకారం.. పదివేల స్థానాల్లో సమ్మెకు మద్దతుగా రైల్రోడ్లు మరియు రక్షణ రంగాలలోని యూనియన్లు ఉద్యమించనున్నాయి.
భారత్ బంద్ కారణాలు.. కీలక డిమాండ్లు
1. బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, పోస్టల్, ఆదాయపు పన్ను, రాగి, బ్యాంకులు, బీమా వంటి వివిధ రంగాలకు చెందిన కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి.
2. కార్మికులు, రైతులు, సామాన్య ప్రజలను ప్రభావితం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు రెండు రోజుల భారత్ బంద్కు పిలుపునిచ్చాయి.
3. 2 రోజుల భారత్ బంద్ పిలుపు వెనుక మరో కారణం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పై వడ్డీ రేటు తగ్గించడం.
4. చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూ ప్రజలపై భారం పడుతున్నాయి. ఇంధన ధరలు పెరుగుతున్న ప్రభుత్వం నియంత్రించకపోవడం ఓ కారణం.
5. కార్మిక చట్టాలలో ప్రతిపాదిత మార్పులను రద్దు చేయడం, ఏ రూపంలోనైనా ప్రైవేటీకరణ చేయడం మరియు జాతీయ మానిటైజేషన్ పైప్లైన్ వంటివి ట్రేడ్ యూనియన్ల డిమాండ్లలో ఉన్నాయి.
6. MNREGA (మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం) కింద వేతనాల కేటాయింపులు పెంచడం మరియు కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించడం కూడా వారి డిమాండ్లలో భాగమే.
7. ఉపాధి కరువవడం, పెరుగుతున్న నిరుద్యోగం, తక్కువ వేతనాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ మరియు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021కి వ్యతిరేకంగా ఉన్న డిమాండ్లు కూడా సార్వత్రిక సమ్మెలో ఉన్నాయి.
8. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటీకరించే కేంద్ర ప్రభుత్వ యోచన, అలాగే బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు-2021ను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.