బాబ్రీ మసీదు కూల్చివేత సరికాదు.. సుప్రీం కోర్టు

By telugu teamFirst Published Nov 9, 2019, 11:45 AM IST
Highlights

ముస్లింలకు ప్రత్యామ్నాయ ప్రదేశం చూపించాలని ఆదేశించారు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల మేర తగిన స్థలాన్ని ఇవ్వాలని జస్టిస్ గొగోయ్ పేర్కొన్నారు. మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు ట్రస్టు ఏర్పాటు చేయాలని సూచించారు.

బాబ్రీ మసీదు కూల్చివేత సరైనదని కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1949లో విగ్రహాలను పెట్టి మసీదును అపవిత్రం చేయడం, 1992లో మసీదును కూల్చివేయడం చట్టాన్ని ఉల్లంఘించడం కిందికే వస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. 

బాబ్రీ మసీదు కూల్చివేయడం తప్పు.. అలా చేయడం సరికాదు అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముస్లింలకు ప్రత్యామ్నాయ ప్రదేశం చూపించాలని ఆదేశించారు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల మేర తగిన స్థలాన్ని ఇవ్వాలని జస్టిస్ గొగోయ్ పేర్కొన్నారు. మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు ట్రస్టు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇదిలా ఉండగా... యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై తీర్పును ఈరోజు వెలువరించనున్న విషయాన్నీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న సాయంత్రం ప్రకటించింది. శనివారం ఉదయం 10:30 గంటలకు అయోధ్య భూ వివాదంపై ఐదుగురు న్యాయమూర్తుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును వెలువరించేందుకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆసీనమయ్యింది. 

కాగా తీర్పు వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే అప్రమత్తత ప్రకటించిన విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్తగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. యూపీ వ్యాప్తంగా 40 వేలకు పైగా సిబ్బందిని మోహరించింది. తీర్పు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేం‍ద్ర ప్రభుత్వం ఇదివరకే హైఅలర్ట్‌ ‍ ప్రకటించింది. స్కూళ్లకు కాలేజీలకు కూడా సెలవులను ప్రకటించేసారు. 


 అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన అంశం అయిన ఈ రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన తీర్పు వెలువడిన అనంతరం నెలకొనే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. 

కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కావడం వల్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని  ఆదేశించింది. ఈ మేరకు గురువారంమే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 

కాగా తీర్పుపై ఎవరూ వివాదస్పద రీతిలో బహిరంగ ప్రకటన చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు. సున్నితమైన అంశం గనుక ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని తెలిపారు. ఈ మేరకు ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ప్రధాని తీర్పుపై  స్పందించిన విషయం తెలిసిందే. 

సోషల్ మీడియా యూజర్స్ కు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇది వరకే స్పష్టమైన హెచ్చరికలు జారీచేసారు. తీర్పు వెలువడిన తరువాత తీర్పుకు వ్యతిరేకంగా లేదా సానుకూలంగా ఎటువంటి రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్టులు చేసినా, వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు.

click me!