Jayaprada: ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా జయప్రద !

By Mahesh RajamoniFirst Published Jun 20, 2022, 11:05 AM IST
Highlights

BJP star campaigner Jayaprada: ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక‌ల పోటీ నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన తప్పుకోవడంతో ఈ నియోజకవర్గంలో అధికార వైఎస్సార్‌సీపీకి బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా మారింది.
 

Atmakur assembly by-election: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో సీనియర్ నటి, రాజ్యసభ మాజీ సభ్యురాలు జయప్రద బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా బరిలోకి దిగనున్నారు. ఈ నెల 19న పార్టీ అభ్యర్థి భరత్‌కుమార్‌ యాదవ్‌ తరఫున జయప్రద ప్రచారం చేస్తారని నియోజకవర్గంలో పార్టీ ప్రచారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.

ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక‌ల పోటీ నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన తప్పుకోవడంతో ఈ నియోజకవర్గంలో అధికార వైఎస్సార్‌సీపీకి బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా మారింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దేవధర్ కూడా నియోజకవర్గంలో క్యాంపులు వేసి ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నారు. సిట్టింగ్‌ శాసనసభ్యుడు, అప్పటి కేబినెట్‌ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంతో జూన్‌ 23న ఆత్మకూర్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. వైఎస్‌ఆర్‌సీపీ తన అభ్యర్థిగా గౌతమ్ సోదరుడు విక్రమ్‌రెడ్డిని బరిలోకి దింపింది. ప్ర‌స్తుతం అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ, ప్ర‌తిప‌క్ష బీజేపీలు గెలుపు పై ధీమాగా ఉన్నాయి. అయితే, ప్ర‌స్తుత ప‌రిణామాలు గ‌మ‌నిస్తే.. అధికార పార్టీకి గెలుపు అవ‌కాశాలు అధికంగా ఉన్నాయి. 

Latest Videos

ల‌క్ష మెజారిటీతో గెలుస్తాం ! 

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ లక్ష మెజారిటీ లక్ష్యంగా పెట్టుకోగా, స్టార్‌ క్యాంపెయినర్లను రంగంలోకి దించిన భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ఓట్ల శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. జూన్ 23న ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. గతంలో నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీకి కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి, రెండు లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు ప్రతిపక్ష పార్టీలకు ఖాళీ లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఏడు 10 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి గట్టిపోటీ ఇచ్చేందుకు బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌ యాదవ్‌ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 1985 ఎన్నికల్లో ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో బీజేపీ గట్టిపోటీనిచ్చి కేవలం 89 ఓట్ల తేడాతో ఓడిపోవడం గమనార్హం. అధికార వైఎస్సార్‌సీకి ఉపఎన్నికల్లో గెలవడం అంత కష్టం కానప్పటికీ, తన బలాన్ని చాటుకునేందుకు లక్ష ఓట్ల తేడాతో విజయకేతనం ఎగురవేయాల‌ని చూస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రచారాన్ని పర్యవేక్షించేందుకు అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక మంత్రి, ఎమ్మెల్యేను నియమించారు. అసెంబ్లీ సీటును అత్యధిక మెజారిటీతో గెలుపొందేందుకు వైఎస్సార్‌సీపీ  త‌మ‌కు ఉన్న ఏ ఒక్క అవ‌కాశాన్ని వదలడం లేదని అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ నేత ఒకరు తెలిపారు.

click me!