
Atiq Ahmed: యూపీ మాఫియాడాన్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్య ఘటన దేశ వ్యాప్తంగా దూమారం రేపుతోంది. ప్రస్తుతం యూపీలో జరిగిన ఎన్ కౌంటర్ పై రాజకీయ పరంగా చర్చ సాగుతోంది. ఈ విషయంలో యోగి సర్కార్ ను ప్రశంసిస్తుంటే.. మరోవైపు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్లో 2017 సంవత్సరంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మొత్తం 183 ఎన్కౌంటర్లపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఇటీవలే ఎన్కౌంటర్లో అతిక్ అహ్మద్ కుమారుడు అసద్, అతనితో పాటు గులాం మహ్మద్ కూడా మరణించారు. 2017 నుంచి ఉత్తరప్రదేశ్లో జరిగిన 183 ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్లో కోరారు. యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత గత 6 ఏళ్లలో జరిగిన ఎన్కౌంటర్లలో 183 మంది మరణించారని యూపీ ఏడీజీ ఇటీవల ఒక జాబితాను విడుదల చేశారు. ఈ ఎన్కౌంటర్లపై ప్రశ్నలు లేవనెత్తిన పిటిషనర్ విచారణకు డిమాండ్ చేశారు.
ఎన్కౌంటర్లో నిందితుల హతం
ప్రయాగ్రాజ్లో ఉమేష్ పాల్ హత్య జరిగినప్పటి నుండి.. అసద్ అహ్మద్తో సహా చాలా మంది నిందితులు పరారీలో ఉన్నారు. ఇటీవల, యుపి పోలీస్ STF టీం అసద్ అహ్మద్ ,గులాం మహ్మద్లను ఎన్కౌంటర్లో హతమార్చింది. ఇది కాకుండా ఉమేష్ పాల్ హత్యకేసులో మరికొందరు నిందితులు కూడా ఎన్కౌంటర్లో హతమయ్యారు. శనివారం..ప్రయాగ్రాజ్లో వైద్య చికిత్స కోసం తీసుకెళుతుండగా ముగ్గురు దుండగులు అతిక్ అహ్మద్ , అష్రఫ్లను పోలీసుల ఎదుటే హత్య చేశారు. ఈ ముగ్గురు నిందితులు పోలీసుల కస్టడీలో ఉండగా ఇప్పుడు వారిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.