
మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఆర్మీ సైనికుడు తన సర్వీస్ రివాల్వర్ తో ఓ ట్రక్కు డ్రైవర్ పై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన డైవర్ పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ సైనికుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకెళ్లే.. నిందితుడి పేరు వికాస్ తివారీ అలియాస్ బ్రజ్ భూషణ్ (24,రేవా నివాసి. నిందితుడు వికాస్ తివారీ నాలుగేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం పంజాబ్లోని పాటియాలాలోని సెకండ్ కార్ప్స్ బెటాలియన్లో నాయక్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సెలవులపై నిందితుడు స్వగ్రామం రీవాకు వచ్చాడు.
ఈ క్రమంలో తన ప్రియుడితో కలిసి శనివారం మధ్యాహ్నం గంగేవ్ సమీపంలోని హనుమాన్ ఆలయానికి వెళ్లాడు . ఈ ప్రేమ జంట లోకాన్ని మరిచి మాట్లాడుకుంది. ఇంతలో పక్క గ్రామానికి చెందిన బ్రజేంద్ర కోరి అలియాస్ భయ్యాంబ(30) అక్కడికి చేరుకున్నాడు. అతను వృత్తిరీత్యా ట్రక్కు డ్రైవర్. వారిద్దరిని ఆ గుడిలో చూసిన ఆ ట్రక్ డైవర్ .. వారికి తెలియకుండా వారి ఫోటోలను రహస్యంగా చిత్రీకరించారు.
వీరిద్దరినీ బ్రజేంద్ర వీడియో తీశాడని ఎవరో జవాన్కు చెప్పారు. దీంతో అతను తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. వెంటనే తన ప్రియురాలిని తన వెంట పెట్టుకుని .. స్కూటీ తో ట్రక్కును వెంబడించడం ప్రారంభించాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత హైవే-30లోని లక్ష్మణ్ దాబా సమీపంలో ట్రక్కును ఆపాడు. సైనికుడు డ్రైవర్ను కిందకు దించమని అడిగాడు. అతను దిగకపోవడంతో అవతలి వైపు నుంచి లారీ ఎక్కి వీడియో డిలీట్ చేయమని డ్రైవర్ను కోరాడు.
వీడియోను తొలగించనందుకు డ్రైవర్ నిరాకరించడంతో ఆవేశానికి గురైన సైనికుడు తన వెంట తెచ్చుకున్న రివాల్వర్ తో తనపై రెండుసార్లు కాల్పులు జరిపాడు. ఈ బుల్లెట్లలో ఒకటి మిస్ కాగా, రెండో బుల్లెట్ బ్రజేంద్ర ఎడమ కంటికి తగిలింది. ఆ తర్వాత నిందితుడు సైనికుడు పారిపోయాడు. బాధితుడిని జిల్లాలోని సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీకి తరలించారు, అతని పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. తివారీపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని రేవా పోలీసు సూపరింటెండెంట్ నవనీత్ భాసిన్ తెలిపారు.