
న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవలే హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో తీవ్ర చర్చను లేవదీసింది. రెండు వేర్వేరు రాష్ట్రాలు ఇంగ్లీష్లో కాకుండా హిందీలో కమ్యూనికేట్ చేసుకోవాలని అమిత్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించింది. తమిళనాడు అధికార, ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. అమిత్ షా వ్యాఖ్యలు దేశ సమగ్రతను దెబ్బతీస్తాయని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. ప్రతిపక్ష నేతలు కూడా హిందీని వ్యతిరేకించాయి. తాము రెండు భాషల విధానాన్ని ఆమోదిస్తామని, తమిళనాడుతోపాటు మరో భాషను తాము అంగీకరిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ తన సోషల్ మీడియాలో చేసిన పోస్టు చర్చనీయాంశం అయింది.
తమ ప్రియమైన తమిళం అంటూ ఆయన తన ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హ్యాండిల్లలో పోస్టు చేశారు. తమిళ దేవతగా భావించే తమిళనాంగు ఫొటోను ఆయన పోస్టు చేశారు. తమిళ్ నేషనల్ యాంథెమ్లోని ఓ పదాన్ని కూడా అందులో కోట్ చేశారు. ఆ యాంథెమ్ను మనోన్మనియన్ సుందరం పిళ్లై రాశారు. ఎంఎస్ విశ్వనాథన్ కంపోజ్ చేశారు.
అదే విధంగా ప్రియమైన తమిళ భాషే తమ అస్తిత్వానికి మూలం అనే అర్థం స్ఫురించే తమిళ పోయెమ్ లైన్నూ ఆయన అందులో జత చేశారు. ఈ పోయెమ్ను 20వ శతాబ్దానికి చెందిన తమిళ జాతీయవాదిగా భావించే భరతిదాసన్ రాశారు.
ఈ పోస్టును నెటిజన్లు అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగానే తీసుకుని చర్చించారు. దీంతో ఇంకొందరు ఆయనపై విరుచుకుపడ్డారు కూడా. తెల్లటి దుస్తుల్లో కనిపించే తమిళ దేవత వెనుక బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఎంచుకోవడంపైనా చర్చ జరిగింది. ఆ ఎరుపు రంగు హిందీ భాష తమపై రుద్దడాన్ని వ్యతిరేకించడమేనని చాలా మంది చర్చించారు. కాగా, మరో యూజర్ ఏఆర్ రెహ్మాన్ను వ్యతిరేకించారు. ఏఆర్ రెహ్మాన తన కెరీర్ మొత్తం హిందీ భాష ఆధారంగానే నిర్మించుకున్నారని, హిందీ సినిమాలకు పని చేసే పేరు సంపాదించుకున్నాడని, ఇప్పుడు చివరకు హిందీని టార్గెట్ చేస్తున్నాడని ఆగ్రహించారు.
న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సమైక్యత సాధనలో అధికార భాష కీలక పాత్ర పోషించే కలించేందుకు సమయం ఆసన్నమైందని చెప్పారు. స్థానిక భాషలకు కాకుండా ఆంగ్లానికి ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని షా అన్నారు. ఒక రాష్ట్రానికి చెందిన వారు మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తితో మాట్లాడాల్సి వస్తే అది భారతీయ భాష అయి ఉండాలని అమిత్ షా అన్నారు. ప్రస్తుతం కేబినెట్లో 70 శాతం ఎజెండా హిందీలో సిద్ధమైందని సభ్యులకు తెలియజేశారు.
ప్రభుత్వం ఖచ్చితంగా హిందీకి ప్రాముఖ్యత ఇస్తుందని ప్రకటించారు. హిందీ నిఘంటువునూ సవరించాల్సి న అవసరం ఉందన్నారు. విద్యార్థులకు తొమ్మిదో తరగతి వరకు హిందీలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలని, హిందీ బోధనా పరీక్షలపైనా మరింత దృష్టిపెట్టాలని పిలుపునిచ్చారు. ఇతర భాషల నుంచి పదాలను స్వీకరించే లా హిందీ మార్పుచెందితేగాని అది వ్యాప్తి చెందదని అమిత్ షా అభిప్రాయపడ్డారు.