
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలియన్స్ అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. ముంబైలోని ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆమెను విదేశీ మారకద్రవ్య నిబంధనల ఉల్లంఘన కేసులో అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)లోని వివిధ సెక్షన్ల కింద నమోదైన కేసులో అనిల్ అంబానీని సోమవారం విచారించింది. దాదాపు 8 గంటల పాటు అనిల్ అంబానీని ప్రశ్నించిన ఈడీ అధికారులు.. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. ఒక రోజు తర్వాత.. టీనా అంబానీ ఈడీ విచారణకు హాజరుకావడం గమనార్హం.
అయితే అనిల్ అంబానీ కంపెనీలలో పెట్టుబడులకు సంబంధించిన ఫెమా ఉల్లంఘన కేసులో ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏ కేసులో ఆయనను ప్రస్తుతం విచారిస్తున్నారనేది ఈడీ వర్గాలు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక, యస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్, ఇతరులపై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి అనిల్ అంబానీ గతంలో 2020లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే, గత ఏడాది ఆగస్టులో రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 814 కోట్లకు పైగా వెల్లడించని నిధులపై రూ. 420 కోట్ల పన్నులు ఎగవేసినందుకు నల్లధనం నిరోధక చట్టం కింద అనిల్ అంబానీకి ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీ చేసింది. అయితే బాంబే హైకోర్టు అనిల్ అంబానీకి సెప్టెంబరులో రిలీఫ్ లభించింది. అనిల్ అంబానీ ఎటువంటి బలవంతపు చర్య తీసుకోవద్దని కోర్టు ఆదాయపు పన్ను శాఖను కోరింది.