
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజధాని డిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. ఓటర్ల జాబితా విషయంలో రాష్ట్రంలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ, కేంద్రంలోని అధికార పార్టీ బిజెపి మద్య మాటల యుద్దం సాగుతోంది. ఎన్నికల సంఘంపై ఒత్తిడితెచ్చి ఆప్ అనుకూల ఓటర్లను తొలగిస్తున్నట్లు ఆప్ ఆరోపిస్తోంది. తాజాగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తన భార్య పేరును కూడా ఓటర్ల లిస్ట్ నుండి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
భారతీయ జనతా పార్టీ నేతల ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారని... ఇలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం కలిగించాలని చూస్తున్నారని ఆరోపించింది. కానీ ఎలాంటి కుట్రలు చేసినా డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆప్ పక్షాన వున్నారు.... ఈ పార్టీని ఎవ్వరూ ఓడించలేరని ఎంపీ సంజయ్ సింగ్ ధీమా వ్యక్తం చేసారు.
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే డిల్లీ ఎన్నికల్లోనూ అక్రమాల ద్వారానే గెలవాలని చూస్తోందని సంజయ్ సింగ్ ఆరోపించారు. అందులో భాగంగానే ఓటర్ల పేరు ఓటర్ లిస్ట్ నుండి మాయం అవుతున్నాయని సంజయ్ సింగ్ ఆరోపించారు. తన భార్య అనిత్ సింగ్ గత లోక్ సభ ఎన్నికల్లో డిల్లీలోని ఓటేసిందని...కేవలం ఆరు నెలల్లోనే ఆమె పేరు ఎలా మాయం అయ్యిందని సంజయ్ సింగ్ ప్రశ్నించారు.
ఇలా డిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బిజెపిపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆప్ నేత సంజయ్ సింగ్ పై బిజెపి నేత అమిత్ మాల్వియా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ మేరుకు ఎక్స్ వేదికన కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసారు. రాజకీయ లబ్ది కోసం సంజయ్ సింగ్ సొంత భార్యను కూడా రాజకీయాల్లోకి లాగారని ఆరోపించారు. సంజయ్ సింగ్ భార్య అఫిడవిట్ ను కూడా అమిత్ మాల్వియా షేర్ చేశారు.
"భార్యను రాజకీయాల్లోకి లాగడానికి కూడా వెనుకాడని వ్యక్తి కంటే నీచమైన వ్యక్తి ఎవరుంటారు? ఇది సంజయ్ సింగ్ భార్య అనితా సింగ్ అఫిడవిట్, అందులో ఆమె ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ ఓటరు అని చెప్పారు. ఢిల్లీ ఓటరు కానప్పుడు ఆమె పేరు ఢిల్లీ ఓటర్ల జాబితాలో ఎలా ఉంటుంది? అఫిడవిట్ లో సుల్తాన్ పూర్ ఓటరు అని చెప్పి ఢిల్లీలో ఓటు వేస్తే అది చట్టరీత్యా నేరం. ఇంకెంత అవమానం భార్యకు కలిగించాలనుకుంటున్నారో సంజయ్ సింగ్ నిర్ణయించుకోవాలి" అంటూ అమిత్ మాల్వియా ట్వీట్ చేసారు.