
Karnataka: మసీదులపై మైకులు, లౌడ్ స్పీకర్లపై ఇటీవల ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాక్రే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు చాలా ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా రెండు వర్గాల మధ్య గత కొన్ని రోజులగా వివాదాలకు నెలవైన కర్నాటకలో మసీదులపై లౌడ్ స్పీకర్ల అంశం మరో వివాదానికి తెరదీసే అవకాశాలు కన్పిస్తున్నాయి. మసీదులపై పెద్ద మైకులు, లౌడ్ స్పీకర్ల ఉంచడంపై నెలకొన్న వివాదాల నడుమ.. మతపరమైన సంస్థలు మరియు ఇతర ప్రదేశాలలో శబ్ద కాలుష్యంపై చర్య తీసుకోవడానికి కర్నాటక పోలీసులు బుధవారం ఒక సర్క్యులర్ ను జారీ చేశారు. కర్ణాటక డైరెక్టర్ జనరల్ మరియు ఐజీపీ ప్రవీణ్ సూద్ రాష్ట్రంలోని అన్ని ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ (IGP), సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) మరియు పోలీస్ కమీషనర్లకు ఈ సర్క్యులర్ జారీ చేశారు.
“శబ్ద కాలుష్య విషయానికి సంబంధించి, మీరు కర్నాటక హైకోర్టు నిర్ణయానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని ఆదేశించారు. ఈ విషయంలో, చట్ట ప్రకారం శబ్ద కాలుష్య నియంత్రణ రూల్స్ 2000ని ఉల్లంఘించినట్లు తేలితే, మతపరమైన సంస్థలు, పబ్లు మరియు ఏదైనా ఇతర సంస్థలు మరియు విధులపై చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని ఆదేశిస్తున్నాం” అని సర్క్యులర్లో పేర్కొన్నారు. మతపరమైన అంశాలకు సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం స్పందిస్తూ.. ప్రభుత్వం ముందు అందరూ సమానమేనని, ప్రభుత్వం ఎలాంటి పక్షపాతం లేదా వివక్ష లేకుండా పనిచేస్తుందని తెలిపారు. "ఏ వ్యక్తి లేదా సంస్థ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోనివ్వకుండా శాంతి భద్రతలకు అన్ని చర్యలు తీసుకుంటాం" అని ఆయన చెప్పారు.
'ఆజాన్' గురించి ముఖ్యమంత్రి వివరిస్తూ, దీనికి సంబంధించి ఇప్పటికే అపెక్స్ కోర్ట్ ఆర్డర్ ఉందని చెప్పారు. “దాని ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించే మరో ఉత్తర్వు కూడా ఉంది. శబ్దం పరిమితి నిర్దేశించబడిందనీ, శబ్దాన్ని కొలిచే డెసిబెల్ మీటర్ను కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. “ఇది అందరినీ విశ్వాసంలోకి తీసుకుని చేయవలసిన పని. ఇది బలవంతంగా చేయలేము. గ్రౌండ్ లెవెల్లో ప్రజాసంఘాల నేతలతో పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పారు.
అయితే, కొనసాగుతున్న రంజాన్ సీజన్లో 'ఆజాన్' సమయంలో లౌడ్స్పీకర్ల వాడకంపై ముఖ్యమంత్రి సిఎం బొమ్మై మళ్లీ ఆందోళన వ్యక్తం చేసిన ప్రకటన ఇది. పోలీసు శాఖ కోర్టుకు సమర్పించిన గణాంకాల ప్రకారం.. 2021 నుండి 2022 ఫిబ్రవరి మధ్య రాష్ట్రంలో శబ్ద కాలుష్యానికి సంబంధించి మొత్తం 301 నోటీసులు జారీ చేయబడ్డాయి. ఇందులో 125 మసీదులు, 83 దేవాలయాలు, 22 చర్చిలకు నోటీసులు జారీ చేశారు. దీంతో పాటు పబ్లు, బార్లు, రెస్టారెంట్లకు 59 నోటీసులు జారీ చేయగా, 12 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చారు. అయితే, రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా హిందూ, ముస్లిం వర్గాల మధ్య పలు అంశాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇటీవలే హిజాబ్ వివాదం, హలాల్ మాంసం వంటి అంశాలు పెద్ద చర్చకు దారితీశాయి.