కాశ్మీర్‌లోని పంజ్‌తర్ని నుంచి అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం.. వివరాలు ఇవే..

Published : Jul 09, 2023, 03:27 PM IST
కాశ్మీర్‌లోని పంజ్‌తర్ని నుంచి అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం.. వివరాలు  ఇవే..

సారాంశం

కాశ్మీర్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా మూడు రోజుల పాటు నిలిపివేయబడిన అమర్‌నాథ్ యాత్ర ఆదివారం (జూలై 9) తిరిగి ప్రారంభమైంది. పంజ్‌తర్ని, శేషనాగ్ బేస్ క్యాంపుల నుండి అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైందని అధికారులు తెలిపారు.

కాశ్మీర్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా మూడు రోజుల పాటు నిలిపివేయబడిన అమర్‌నాథ్ యాత్ర ఆదివారం (జూలై 9) తిరిగి ప్రారంభమైంది. పంజ్‌తర్ని, శేషనాగ్ బేస్ క్యాంపుల నుండి అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైందని అధికారులు తెలిపారు. అమర్‌నాథ్ ఆలయం చుట్టూ ఆకాశం నిర్మలమైన వెంటనే అధికారులు గేట్లను తెరిచి.. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో సహజంగా ఏర్పడిన హిమలింగం వద్ద ప్రార్థనలు చేయడానికి భక్తులను అనుమతించారని చెప్పారు. అలాగే ఇప్పటికే దర్శనం చేసుకన్న భక్తులను బల్తాల్ బేస్ క్యాంపుకు తిరిగి అనుమతించారని పంజ్‌తర్ని బేస్ క్యాంపులోని సీనియర్ అధికారి చెప్పినట్టుగా పీటీఐ వార్తాసంస్థ రిపోర్టుచేసింది. 

మరోవైపు భారత ఆర్మీ అనంతనాగ్ జిల్లాలోని ఖాజీగుండ్‌లోని తమ శిబిరంలో భారీ వర్షాల కారణంగా చిక్కుకుపోయిన 700 మందికి పైగా అమర్‌నాథ్ యాత్రికులకు ఆశ్రయం కల్పించింది. భారీ వర్షాల కారణంగా వారి యాత్ర నిలిచిపోయింది. ఇదిలా ఉంటే, ప్రతికూల వాతావరణం, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేయడం వల్ల జమ్మూ నుంచి తాజా బ్యాచ్ యాత్రికులను అనుమతించలేదని అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడటం, రాంబన్ జిల్లాలో దాదాపు 40 మీటర్ల రహదారి విస్తీర్ణం కొట్టుకుపోవడంతో 3,500 వాహనాలు నిలిచిపోయాయని, హైవేపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

జమ్మూ కాశ్మీర్‌లోని చాలా ప్రాంతాలలో గురువారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు అమర్‌నాథ్ ఆలయం వద్ద హిమాపాతం నమోదైంది. అయితే సోమవారం నుంచి వాతావరణం మెరుగుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి క్లియరెన్స్ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

‘‘కొండచరియలు విరిగిపడిన శిధిలాలను క్లియర్ చేయడం, పంథియాల్ టన్నెల్ సమీపంలోని రోడ్డు దెబ్బతిన్న భాగాన్ని పాత రోడ్డు అలైన్‌మెంట్ ద్వారా బైపాస్ చేయడం కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. పంథియాల్ వద్ద హైవేకి ఎదురుగా ఉన్న కొండల నుంచి రాళ్లు పడుతుండటం వల్ల పునరుద్ధరణ పనిలో జాప్యం జరుగుతుంది’’ అని అధికారులు  చెబుతున్నారు. రహదారిని ట్రాఫిక్‌కు అనుకూలంగా మార్చిన తర్వాత చిక్కుకుపోయిన వాహనాలను ప్రాధాన్యతపై క్లియర్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత జమ్మూ, శ్రీనగర్ నుంచి ట్రాఫిక్‌ను అనుమతిస్తామని  చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu