మహా'క్యాంపు' : రిసార్ట్ రాజకీయాలకు తెరతీసిన పార్టీలు

By telugu teamFirst Published Nov 23, 2019, 3:30 PM IST
Highlights

మహారాష్ట్రలో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ నేటి సాయంత్రం తమ ఎమ్మెల్యేలను మధ్యప్రదేశ్ కి తరలించనున్నట్టు సమాచారం. ఇకపోతే ఎన్సీపీ కూడా తమ ఎమ్మెల్యేలను నేటి సాయంత్రం 4.30 మీటింగ్ తరువాత ఏదన్నా రిసార్టుకు తరలించేందుకు సిద్ధమయ్యారు.

ముంబై: మహారాష్ట్రలో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ నేటి సాయంత్రం తమ ఎమ్మెల్యేలను మధ్యప్రదేశ్ కి తరలించనున్నట్టు సమాచారం. ఇకపోతే ఎన్సీపీ కూడా తమ ఎమ్మెల్యేలను నేటి సాయంత్రం 4.30 మీటింగ్ తరువాత ఏదన్నా రిసార్టుకు తరలించేందుకు సిద్ధమయ్యారు. శివసేన తన ఎమ్మెల్యేలను ఏదైతే హోటల్ లో ఉంచారో, అదే హోటల్ లో కొనసాగించేందుకు నిర్ణయించారు. 

మరోవైపు అజిత్ పవార్ తన వర్గంలోని ఎన్సీపీ రెబెల్ ఎమ్మెల్యేలను కూడా కాపాడుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు అజిత్ పవార్ కి 13 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారు. వీరందరి రక్షణ బాధ్యతను బీజేపీ తీసుకున్నట్టు సమాచారం.  బీజేపీ ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. 

బల నిరూపణకు మరో వారం పాటు సమయం ఉన్నందును అన్ని పార్టీలు కూడా తమ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఉదయం శరద్ పవార్ ప్రెస్ మీట్లో కూడా ఎలాగైనాసరే, తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటామని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఈ క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. 

ఇకపోతే, బీజేపీకి మద్దతివ్వాలనే అజిత్ పవార్ నిర్ణయం తో తనకు కానీ, తన పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదని, ఆ నిర్ణయాన్ని ఎన్సీపీ ఏ విధంగానూ సమర్థించబోదని శరద్ పవార్ తన ట్విట్టర్ వేదికగా తెలియచెప్పాడు. మహారాష్ట్ర రాజకీయాల్లో తిరిగిన ఊహించని మలుపుతో, ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతుతో సీఎం పీఠం ఎక్కాలన్న శివసేన ఆశలకు బీజేపీ గండికొట్టినట్టయ్యింది.  

తెరవెనక చక్రం తిప్పిన అమిత్ షా, ఎన్సీపీని తన వైపుకు తిప్పుకోగలిగాడు. కూటమి ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేనే ఉంటారని శుక్రవారం రాత్రే శరద్‌ పవార్‌ ప్రకటించారు. ఈలోపే దేవేంద్ర ఫడ్నవిస్‌ కేంద్ర పెద్దల సూచనలతో ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌తో రహస్య మంతనాలు జరిపినట్టు సమాచారం. బీజేపీకి మద్దతిస్తె, డిప్యూటీ సీఎంతో పాటు ఇతర మంత్రివర్గ బెర్తులను ఇస్తామని చెప్పారట. 

అయితే తొలి నుంచి ఉద్ధవ్‌ ఠాక్రేకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న అజిత్‌ పవార్‌ బీజేపీ నేతలతో చేతులు కలిపినట్లు సమాచారం. అజిత్‌  చర్యతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతలు షాక్‌కి గురయ్యారు.అయితే ఈ వ్యవహారమంతా శరద్‌ పవార్‌కు తెలియకుండా అజిత్‌ పవార్‌ జాగ్రత్త పడ్డారని ఎన్సీపీ వర్గాలంటున్నాయి. 

ఈ నేపథ్యంలోనే 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీకి మద్దతు ప్రకటించి, ఎన్సీపీలో చీలిక తెచ్చారని వార్తలు గుప్పుమంటున్నాయి. కాగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాల్లో గెలుపొందిన  విషయం తెలిసిందే. 

click me!