అన్నాడీఎంకేలో తారాస్థాయికి అంతర్గత పోరు.. దాడులు చేసుకున్న పళని, పన్నీరు వర్గీయులు.. తీవ్ర ఉద్రిక్తత..

Published : Jul 11, 2022, 09:37 AM IST
అన్నాడీఎంకేలో తారాస్థాయికి అంతర్గత పోరు.. దాడులు చేసుకున్న పళని, పన్నీరు వర్గీయులు.. తీవ్ర ఉద్రిక్తత..

సారాంశం

అన్నాడీఎంకేలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. అన్నాడీఎంకే పార్టీ‌పై నియంత్రణ కోసం పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య పోరు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు  పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశానికి పళనిస్వామి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

అన్నాడీఎంకేలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. అన్నాడీఎంకే పార్టీ‌పై నియంత్రణ కోసం పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య పోరు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు  పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశానికి పళనిస్వామి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ భవిష్యత్తు నాయకత్వ నిర్మాణాన్ని నిర్ణయించే విధంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయన వర్గం ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఈ సమావేశం జరగకుండా స్టే కోరుతూ పన్నీరుసెల్వం కోర్టును ఆశ్రయించారు. అయితే ఇందుకు సంబంధించి కోర్టు నేడు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. 

పన్నీరు సెల్వం చేసిన విజ్ఞప్తిపై ఈ రోజు ఉదయం 9 గంటలకు తన ఉత్తర్వులను ప్రకటించనున్నట్టుగా మద్రాస్ హైకోర్టు తెలిపింది. మరోవైపు ఉదయం 9.15 గంటలకు పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీ కార్యాలయం వద్ద పన్నీరు సెల్వం, పళనిస్వామి వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు  రువ్వుకున్నారు. సమీపంలోని పార్క్ చేసిన పలు వాహనాలను కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే శ్రేణులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 

దివంగత జయలలిత జైలు వెళ్లాల్సి వచ్చిన సమయంలో పన్నీరు సెల్వంకు  స్టాండ్-ఇన్-చీఫ్ మినిస్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆమె చనిపోయేముందు కూడా పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. అయితే కొంతకాలం పాటు పార్టీని ఆధీనంలోకి తీసుకున్న జయలలిత సన్నిహితురాలు శశికళ.. తిరుగుబాటు చేయడంతో పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

అయితే శశికళ జైలులో ఉన్న సమయంలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గీయులు ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇక, ముఖ్యమంత్రిగా నాలుగేళ్ల కాలంలో పళనిస్వామి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని పార్టీని తన అధీనంలోకి తెచ్చుకున్నారు. అయితే ఎన్నికల్లో పార్టీ వరుస ఓటముల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న మోడల్ కరెక్ట్ కాదని పళనిస్వామి చెబుతున్నారు. ఆయనకు పార్టీలో మద్దతు భారీగా ఉంది. మరోవైపు పార్టీపై నియంత్రణ కోసం పన్నీర్ సెల్వం వర్గం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 

చట్టాన్ని అనుసరించి జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని కొనసాగించడానికి పళనిస్వామి వర్గానికి సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే పన్నీర్ సెల్వం వర్గం మాత్రం.. ఈ సమావేశం నిర్వహణ సాంకేతికంగా చట్టవిరుద్ధమని, అందువల్ల చెల్లదని వాదిస్తుంది. బైలా ప్రకారం కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ మాత్రమే సమావేశాన్ని ఏర్పాటు చేయగలరని ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?