భారత్‌పై మొదలైన ఆఫ్ఘన్ సంక్షోభ ప్రభావం.. జమ్మూ డ్రై ఫ్రూట్ మార్కెట్‌ కుదేలు

By Siva KodatiFirst Published Aug 19, 2021, 6:56 PM IST
Highlights

ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం భారత్‌పై ప్రభావాన్ని చూపుతోంది. ప్రధానంగా జమ్మూలోని డ్రైఫ్రూట్ మార్కెట్ ఈ దెబ్బకు కుదేలైంది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి బాదం పప్పులు, అంజూర, పిస్తా వంటి డ్రైఫ్రూట్స్ అనేక దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. నాణ్యమైన డ్రైఫ్రూట్స్ కు ఆఫ్ఘనిస్థాన్ పెట్టిందిపేరు. 

ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్లడంతో ఈ సంక్షోభ ప్రభావం ప్రపంచంపై పడింది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా.. ఇంటా బయటా అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రభావం భారత్‌పైనే పడింది. ప్రధానంగా జమ్మూలోని డ్రైఫ్రూట్ మార్కెట్ ఈ దెబ్బకు కుదేలైంది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి బాదం పప్పులు, అంజూర, పిస్తా వంటి డ్రైఫ్రూట్స్ అనేక దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. నాణ్యమైన డ్రైఫ్రూట్స్ కు ఆఫ్ఘనిస్థాన్ పెట్టిందిపేరు. భారత్ లోని జమ్మూ ప్రాంతంలోనూ ఆఫ్ఘన్ నుంచి అత్యధికంగా ఎండు ఫలాలను దిగుమతి చేసుకుంటారు. కొన్ని రకాల డ్రైఫ్రూట్స్ కేవలం ఆఫ్ఘన్ నుంచే దిగుమతి అవుతుంటాయి.

అయితే, ఆఫ్ఘనిస్థాన్ లో సంక్షోభం నేపథ్యంలో జమ్మూకు దిగుమతులు నిలిచిపోయాయి. దాంతో ఇక్కడి మార్కెట్లో డ్రైఫ్రూట్స్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పర్యవసానంగా కొనేవాళ్లు లేక వ్యాపారులు నష్టాల పాలవుతున్నారు. గతం వారం రోజులుగా జమ్మూ డ్రైఫ్రూట్ మార్కెట్లో అమ్మకాలు పడిపోయాయి. దిగుమతులు లేక ధరలు పెంచామని చెబుతున్నా తమ కస్టమర్లు వినిపించుకోవడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. పండుగల సీజన్ లో ఇది తమకు విఘాతం వంటిదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ALso Read:తాలిబాన్లపై గెరిల్లా పోరాటం? ‘దళం సిద్ధంగా ఉంది.. ఆయుధాలు పంపండి’

ఇక, వినియోగదారుల విషయానికొస్తే... ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి డ్రైఫ్రూట్స్ ఎంతో ఉపకరిస్తాయని, కానీ వాటి ధరలు చూస్తే మండిపోతున్నాయని ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో డ్రైఫ్రూట్స్ వ్యాపారం జోరుగా సాగింది. అయితే ఆఫ్ఘన్ సంక్షోభం కాస్తా ఈ వ్యాపారంపై గట్టి దెబ్బకొట్టింది. ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే, తమ వ్యాపారం దారుణంగా దెబ్బతినడం ఖాయమని జమ్మూలోని డ్రైఫ్రూట్ రిటైల్ వ్యాపారుల సంఘం అంటోంది. 

click me!