
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ (శివన్న) యాక్టివ్గా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈరోజు రాహుల్ గాంధీతో కలిసి శివరాజ్ కుమార్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ అభిమానిగా తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని.. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారని శివరాజ్ కుమార్ గుర్తుచేశారు.
రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర నుంచి తాను చాలా ప్రేరణ పొందానని శివరాజ్ కుమార్ చెప్పారు. ఇదిలా ఉంటే.. శివరాజ్ కుమార్ భార్య గీతా శివ రాజ్ కుమార్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. గతంలో గీతా జేడీ(ఎస్)లో ఉన్నారు. అయితే ఏప్రిల్ 28న కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సమక్షంలో గీతా కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గీతా శివరాజ్ కుమార్ సోదరుడు మధు బంగారప్ప శివమొగ్గ జిల్లాలోని సొరబ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ క్రమంలోనే శివరాజ్ కుమార్ తన భార్యతో కలిసి ఏప్రిల్ 30న బంగారప్ప కోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారప్పకు ఓటు వేయాల్సిందిగా ఓటర్లకు పిలుపునిచ్చారు. తన భార్య రాజకీయాల్లో ఉన్నారని.. తనకు అన్ని పార్టీల్లో స్నేహితులు ఉన్నారని.. అయితే తాను యాక్టివ్ రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు సిద్దరామయ్య, జగదీష్ శెట్టర్ల తరఫున కూడా తాను ప్రచారం చేయనున్నట్టుగా చెప్పారు. జగదీష్ శెట్టర్ తనకు కుటుంబ సభ్యుడిలాంటి వ్యక్తి అని అన్నారు.