Gujarat: యువతకు 1 మిలియన్ ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని తన పార్టీ ఎన్నికల వాగ్దానాలను పునరుద్ఘాటించిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. గుజరాత్ మార్పు తుఫాను దిశగా పయనిస్తోందని అన్నారు.
Gujarat Assembly Election 2022: గుజరాత్ లో ఎలాగైనా అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దానికి అనుగుణంగా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్నీవాల్ వరుస ఎన్నికల ప్రచార ర్యాలీలను నిర్వస్తున్నారు. సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలి పట్టణంలో జరిగిన ప్రచార ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, విద్యారంగంలో ఢిల్లీలో తన నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. యువతకు 1 మిలియన్ ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని తన పార్టీ ఎన్నికల వాగ్దానాలను పునరుద్ఘాటించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. గుజరాత్ మార్పు తుఫాను దిశగా పయనిస్తోందని అన్నారు.
“మేము యువతకు ఒక మిలియన్ ప్రభుత్వ ఉద్యోగాలను అందిస్తాము. మీ కుటుంబ సభ్యులకు ఉపాధి లభించని వరకు, మేము నిరుద్యోగ భృతిగా ₹ 3,000 ఇస్తాము. గుజరాత్ కూడా మీ పిల్లలకు అద్భుతమైన విద్యను ఉచితంగా అందజేస్తుంది. ఢిల్లీలో ఆటో డ్రైవర్ల కొడుకులు, కూతుళ్లు ఇంజనీర్లు, కూలీలు డాక్టర్లు అవుతున్నారు' అని కేజ్రీవాల్ అన్నారు. కాగా, గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ పోటీ చేస్తోంది. “ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజా సమస్యలను లేవనెత్తుతూ ప్రజల్లోకి వెళుతోంది. గుజరాత్లోని ప్రజలు నన్ను తమ కుటుంబ సభ్యునిగా చేర్చుకున్నారు. బాధ్యతాయుతమైన సోదరునిగా మీ కుటుంబ బాధ్యతలను నేను నిర్వర్తిస్తానని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. నిరంతర ధరల పెరుగుదలతో ప్రజలు విసిగిపోయారు, నేను ఆ భారాన్ని లేకుండా చేస్తాను”అని కేజ్రీవాల్ సోమవారం అన్నారు.
ఉచిత విద్యుత్తు వాగ్దానాన్ని పునరుద్ఘాటిస్తూ, 'మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నేను మీ విద్యుత్ బిల్లులను చెల్లిస్తాను. ఢిల్లీ ప్రజలకు 24 గంటల కరెంటు ఇస్తున్నా ఇంకా బిల్లు లేదు. పంజాబ్లో కూడా అదే అలానే ఉంది. గుజరాత్ ప్రజలకు సైతం ఉచిత విద్యుత్ అందిస్తాం' అని ఆయన అన్నారు.“నాకు రాజకీయాలు తెలీదు, ‘గూండాగిరి’ తెలియదు, కబుర్లు చెప్పను.. నేను చదువుకున్న వ్యక్తిని, నాకు పని మాత్రమే తెలుసు. పాఠశాలలు, ఆసుపత్రులు ఎలా నిర్మించాలో నాకు తెలుసు, మేము ఢిల్లీతో పాటు పంజాబ్లో కూడా చేశాము. నేను తప్పుడు వాగ్దానాలు ఇవ్వను” అని ఆప్ కన్వీనర్ తెలిపారు. రాష్ట్రంలో 27 ఏళ్ల బీజేపీ పాలనను ప్రస్తావిస్తూ, ‘‘27 ఏళ్లలో బీజేపీ మీకు ఏం ఇచ్చింది? కాకపోతే వచ్చే ఐదేళ్లలో చేస్తాం అనుకోకండి. మీరు వారికి 27 సంవత్సరాలు ఇచ్చారు, ఇప్పుడు దయచేసి మాకు 5 సంవత్సరాలు ఇవ్వండి..నేను తీసుకువచ్చే మార్పును మీరే చూడండి”అని కేజ్రీవాల్ అన్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి యమల్ వ్యాస్ మాట్లాడుతూ, ''గుజరాత్ ప్రజలే అత్యుత్తమ న్యాయనిర్ణేతలని నేను భావిస్తున్నాను. ఎన్నికల సమయంలో, ప్రతి రాజకీయ పార్టీకి వారి స్వంత అభిప్రాయాలు ఉంటాయి, కానీ గుజరాత్ ప్రజలు తగినంత పరిణతితో ఉన్నారని నేను భావిస్తున్నాను. వారు మరోసారి బీజేపీని అధికారంలోకి వస్తారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము'' అని తెలిపారు.