
న్యూఢిల్లీ : పంజాబ్ (Punjab) ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) తన కేబినెట్లోని ప్రతీ మంత్రికి ఒక టార్గెట్ని నిర్దేశిస్తారని, అది నెరవేరకపోతే ఆ మంత్రిని తొలగించాలని ప్రజలు డిమాండ్ చేయవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు.
పంజాబ్లో కొత్తగా ఎన్నికైన ఆప్ (AAP) ఎమ్మెల్యేలందరినీ ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం కేజ్రీవాల్ మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మూడు రోజుల్లోనే భగవంత్ మాన్ గొప్ప పనులు చేశారని తెలిపారు. “ దేశం మొత్తం భగవంత్ మాన్ చేసిన పనుల గురించి మాట్లాడుతోంది. అక్టోబర్లో నష్టపోయిన పంటలకు పరిహారం విడుదలైంది. దీనికి సంబంధించిన చెక్కులను రానున్న రోజుల్లో అందుతాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మూడు రోజుల్లోనే మీరు మంచి పని చేశారు ’’ అని కేజ్రీవాల్ తెలిపారు.
“ భగవంత్ మాన్ ప్రతీ మంత్రికి ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. వారు నిర్ణీత కాలపరిమితిలో ఆ పని పూర్తి చేయాలి. రాత్రి, పగలు కష్టపడాలి. మీ లక్ష్యం నెరవేరకపోతే మంత్రిని మార్చమని ప్రజలే చెబుతారు ’’ అని కేజ్రీవాల్ చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ మాన్ నాయకత్వంలో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, తాను మార్గదర్శనం ఇవ్వడానికి ఒక అన్నయ్యలా అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand), మణిపూర్ (Manipur), గోవా (Goa) నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ (BJP) విజయం సాధించినప్పటికీ, ఇప్పటి వరకు ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని ఆప్ అధినేత విరుచుకుపడ్డారు. నాలుగు రాష్ట్రాల్లో గెలుపొందిన బీజేపీ ఇప్పటి వరకు పార్టీలోని పోరు కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని కేజ్రీవాల్ చెప్పారు.
మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లతో భారీ విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ 18 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ రెండు, శిరోమణి అకాలీ దాలి మూడు స్థానాల్లో విజయం సాధించాయి. ఈ సారి నిర్వహించిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులను కూడా ఓడించింది. ప్రస్తుత సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ(charanjith singh channi) రెండు స్థానాల నుంచి ఓడిపోయారు. అలాగే కాంగ్రెస్ పంజాబ్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ (amarinder singh) కూడా ఓటమి పాలయ్యారు. అలాగే మరో సీనియర్ నాయకుడు ప్రకాష్ సింగ్ బాదల్ కూడా అపజయం పొందారు. ఈ ఎన్నికల్లో అకాలీదళ్-బహుజన్ సమాజ్ వాదీ పార్టీతో కలిసి పోటీ చేసింది. ఆ కానీ పొత్తు ప్రభావం చూపలేకపోయింది.
పంజాబ్ సీఎంగా ఇటీవల భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. భగత్ సింగ్ (bhagat singh) పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్ ఈ ప్రమాణస్వీకార వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం ఆయన కేబినేట్ లో పది మందికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. వారంతా నిన్న ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో ఇద్దరు డాక్టర్లు, లాయర్లు ఉన్నారు. అధికశాతం మంది ఉన్నత విద్యావంతులే మంత్రులుగా ఎంపికయ్యారు. వారితో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు.