శబరిమల నుంచి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం.. 8 మంది భక్తుల మృతి..

By Sumanth KanukulaFirst Published Dec 24, 2022, 9:14 AM IST
Highlights

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడటంతో 8 మంది మృతిచెందారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడటంతో 8 మంది మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తేని జిల్లాలోని కుముళి కొండ మార్గంలో ఈ ప్రమాదం  చోటుచేసుకుంది. ఈ ప్రమాదం శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుందని తేని జిల్లా కలెక్టర్ కేవీ మురళీధరన్ తెలిపారు. బాధితులు శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా.. వారి వాహనం కుముళి కొండ మార్గంలో అదుపు తప్పి 40 అడుగుల లోతులో పడింది. 

ఆ మార్గంలో వెళ్తున్నవారు ఈ ప్రమాదాన్ని గమనించి పోలీసులకు, అగ్నిమాప శాఖకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి సమయంలో కూడా సహాయక చర్యలను కొనసాగించారు. వాహనంలో మొత్తం 10 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏడుగురు ఘటన స్థలంలోనే మృతిచెందగా.. ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. మృతుల్లో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో ఓ చిన్నారి కూడా ఉన్నారు. 

ఇక, కొండ మార్గంలో మలుపు తిరుగుతుండగా డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. వీరంతా జిల్లాలోని అండిపట్టికి చెందినవారిగా తెలుస్తోంది.

click me!