
Punjab Election 2022: ఉత్కంత భరితంగా సాగుతున్న ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మరో కీలక ఘట్టం ముగిసింది. ఆదివారం జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య 117 స్థానాలకు 24,740 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. వృద్ధులను, దివ్యాంగులను తరలించడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా 196 పింక్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల అధికారులు చెప్పుతున్నారు.
అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో గతంతో పోల్చితే.. ఈ యేడాది తక్కువ ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. 2017లో పంజాబ్లో 77.4% ఓటింగ్ నమోదు కాగా ప్రస్తుతం 69.65 శాతం మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈసారి పంజాబ్ ఎన్నికల్లో 1,304 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 93 మంది మహిళలుండగా.. ఇద్దరు ట్రాన్స్జెండర్లు ఉన్నారు. అభ్యర్థులందరి భవితవ్యాన్ని ఈవీఎం యంత్రాల్లో నిక్షిప్తమైంది. మార్చి 10 న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో తేలనుంది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,02,00,996 మంది మహిళలు సహా 2,14,99,804 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పంజాబ్ లో ఈ సారి బహుముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), బీజేపీ కూటమి ల మధ్య పోటీ నెలకొంది. అలాగే రైతులు సంస్థల రాజకీయ విభాగమైన ‘యునైటెడ్ సమాజ్ మోర్చా’ కూడా గట్టి పోటీ ఇవ్వనున్నట్టు అంచన వేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో ఎస్ఎడి .. బిఎస్పితో పొత్తుతో పెట్టుకోగా.. బిజెపితో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. అలాగే.. సుఖ్దేవ్ సింగ్ ధిండా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (యునైటెడ్)తో కూడా పొత్తు పెట్టుకుంది. కేంద్రంలోని వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమంలో పాల్గొన్న పంజాబ్లోని అనేక రైతు సంఘాలు ‘సయుక్త్ సమాజ్ మోర్చా’ (ఎస్ఎస్ఎం)ను ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేయడం గమన్హరం.
యూపీలో 60 శాతం ఓటింగ్
ఉత్తరప్రదేశ్ లో మూడో విడుత పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. 59 స్థానాలకు పోలింగ్ జరగ్గా 60% ఓటింగ్ నమోదు అయినట్టు ఈసీ తెలిపింది. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పోటీ చేస్తున్న కర్హల్ స్థానానికి కూడా ఈ దశలోనే ఓటింగ్ జరిగింది. జశ్వంత్నగర్లో అఖిలేశ్ ఓటు హక్కు వినియోగించుకొన్నారు.