ఒడిషా : సీఆర్పీఎఫ్ బలగాలపై మావోల మెరుపు దాడి.. ముగ్గురు జవాన్లు మృతి

Siva Kodati |  
Published : Jun 21, 2022, 07:08 PM ISTUpdated : Jun 21, 2022, 08:18 PM IST
ఒడిషా : సీఆర్పీఎఫ్ బలగాలపై మావోల మెరుపు దాడి.. ముగ్గురు జవాన్లు మృతి

సారాంశం

ఒడిషాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. మంగళవారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై మెరుపు దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఒడిషాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. మంగళవారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై మెరుపు దాడికి దిగారు. నవపాడా బోడెన్ బ్లాక్ పరిధిలోని పాతధార రిజర్వ్  ఫారెస్ట్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఒక క్యాంప్ నుంచి మరో క్యాంప్‌కి వెళ్తుండగా మావోలు దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. మృతులను ఏఎస్ఐ శిశుపాల్ సింగ్, ఏఎస్ఐ శివలాల్, కానిస్టేబుల్ ధర్మేంద్ర కుమార్ సింగ్‌గా గుర్తించారు. 

వీరిని 19వ బెటాలియన్ సీఆర్పీఎఫ్‌కి చెందిన రోడ్ ఓపెనింగ్ పార్టీగా గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో నువాపాడా జిల్లాలోని బోడెన్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని సహజ్ పానీ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు కాల్పులకు దిగారు. అయితే జవాన్లు ఎదురు కాల్పులకు దిగడంతో మావోలు అక్కడి నుంచి పారిపోయారు. రోడ్డు ఓపెనింగ్ కోసం జవాన్లు కొత్త క్యాంప్‌కి వెళ్లే సమయంలో భారీ వర్షం పడటంతో ముగ్గురు జవాన్లు టార్పాలిన్ కింద తలదాచుకున్నారు. 

ఈ క్రమంలో మావోయిస్టులు జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వీరు ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. మరణించిన జవాన్ల వద్ద నుంచి మూడు ఏకే 47 రైఫిళ్లను, మందుగుండు సామాగ్రిని మావోయిస్టులు ఎత్తికెళ్లినట్లు ఐజీ అమితాబ్ ఠాకూర్ వెల్లడించారు. ఘటన గురించి తెలియగానే నౌపాడా ఎస్పీ, సీఆర్పీఎఫ్ అధికారులు స్పాట్‌కు చేరుకున్నారు. దీంతో మావోయిస్టుల కోసం పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు కూంబింగ్ మొదలుపెట్టాయి. 
 

PREV
click me!

Recommended Stories

వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఓటింగ్ ఎలా జరిగింది? | Asianet News Telugu
తమిళనాడు ఎన్నికల్లో కమల్ హాసన్ జోరుగా ప్రచారం| Asianet News Telugu