
పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో శనివారం అర్థరాత్రి డ్రోన్ల చొరబాటు కలకలం చేలారేగింది. రాష్ట్రంలోని గురుదాస్పూర్ జిల్లాలో రెండు డ్రోన్లు సంచరించడాన్ని భద్రత బలగాలు గుర్తించాయి. కాగా మరో డ్రోన్ అమృత్సర్ జిల్లాలోని చన్నా పటాన్ ప్రాంతంలో సంచరించినట్టు అధికారులు గుర్తించారు. అప్రమత్తమైన బీఎస్ఎఫ్ సిబ్బంది డ్రోన్పై కాల్పులు ప్రారంభించారు. దీంతో అవి పాకిస్తాన్ వైపుకు తిరిగి వెళ్లాయని అధికారులు ఆదివారం తెలిపారు. BSF సిబ్బంది డ్రోన్పై కనీసం 96 రౌండ్లు కాల్పులు జరిపారని, ఐదు తేలికపాటి బాంబులను కూడా విసిరారని అధికారులు తెలిపారు. దీని ద్వారా ఆయుధాలు, డ్రగ్స్, పేలుడు పదార్థాలు అక్రమంగా రవాణా అయ్యాయా అనే కోణంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అదే సమయంలో శనివారం రాత్రి 11.46 గంటలకు అమృత్సర్ జిల్లాలోని చన్నా పటాన్ ప్రాంతంలో మరో డ్రోన్ కనిపించింది. అప్రమత్తమైన బీఎస్ఎఫ్ జవాన్లు దానిపై పది రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో డ్రోన్ వెనక్కి వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు. అంతకుముందు.. నవంబర్ 14 న సరిహద్దులో డ్రోన్ సంచరించిందనీ, పఠాన్కోట్లోని బమియాల్ సెక్టార్లో డ్రోన్ తిరుగుతున్నట్లు బీఎస్ఎఫ్ జవాన్లు చూశారు. డ్రోన్ను చూసిన జవాన్లు దానిపై అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో ఆ డ్రోన్ పాకిస్తాన్ వైపు వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు.
ఈ ఏడాది పెరిగిన డ్రోన్ చొరబాట్లు
అంతకుముందు నవంబర్ 9 న పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లోని భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులో చొరబడిన డ్రోన్ ను సరిహద్దు భద్రతా దళ సిబ్బంది కూల్చివేసింది. పాకిస్థాన్ సరిహద్దులోని పంజాబ్,జమ్మూ సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పంపుతున్న కేసులు 2022లో రెట్టింపు అయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ తన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
పంజాబ్లో అధికం..
2020లో భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో డ్రోన్ల అక్రమ చొరబాట్లకు సంబంధించి 79 ఘటనలు నమోదు కాగా.. 2021లో ఆ సంఖ్య 109కి పెరిగింది. కానీ..ఈ ఏడాది ఈ ఘటనలు రెట్టింపు అయ్యాయి. ఈ ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 266కు చోటు చేసుకున్నట్టు తెలిపారు. పంజాబ్ లో అత్యధికంగా 215 సార్లు డ్రోన్స్ చొరబాట్లు జరిగాయి. జమ్మూలో 22 కేసులు నమోదయ్యాయని తెలిపారు. సరిహద్దుల్లో డ్రోన్ల చొరబాటు అడ్డుకునేందుకు BSF అప్రమత్తంగా ఉందని, దానిని ఎదుర్కోవడానికి నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు.
పంజాబ్ను అస్థిరపరిచేందుకు పాకిస్థాన్ కుట్ర
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో విఫలమైన పాకిస్థాన్.. గత రెండేళ్లుగా పంజాబ్ను అస్థిరపరిచేందుకు నిరంతరం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పంజాబ్లోని డ్రగ్స్ స్మగ్లర్లను, గ్యాంగ్స్టర్లను ఉపయోగించుకుంటున్నారు. గతంలో ఆయుధాలు,డ్రగ్స్ కేసుల్లో అరెస్టయిన డ్రగ్స్ స్మగ్లర్లను,ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాదులను విచారించగా ఈ విషయం తేటతేలమైంది.రెండు రోజుల క్రితం పంజాబ్ పోలీసులు ఇద్దరు డ్రగ్స్ వ్యాపారులను హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు.