జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణో దేవీ ఆలయంలో శనివారం ఉదయం విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాట చోటు చేసుకుని 12 మంది భక్తులు మరణించారు. డజను మందికి పైగా గాయపడ్డారు.
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కాత్రాలోని మాతా వైష్ణోదేవీ భవన్ లో శనివారం ఉదయం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది మరణించగా, 14 మంది గాయపడ్డారు. గాయపడినవారిని నరైనా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
భక్తులు పెద్ద యెత్తున తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుందని అధికారులు చెప్పారు. త్రికూట పర్వత శ్రేణుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు వైష్ణోదేవీ భవన్ కు భక్తులు పోటెత్తారు. మృతుల్లో ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన భక్తులున్నారు. ఒకరు జమ్మూ కాశ్మీర్ కు చెందిన వ్యక్తి.
Vaishno Devi Bhawanలో జరిగిన Stampedeలో ఆరుగురు మరణించారని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ గోపాల్ దత్ ఓ ప్రకటనలో ఓ తెలిపారు. ఎంత మంది చనిపోయారనేది కచ్చితంగా ఇప్పుడే చెప్పలేమని, సంఖ్య తేలలేదని ఆయన అన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతోందని అన్నారు. గాయపడినవారి సంఖ్య కూడా నిర్ధారించలేదని అన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు చెప్పారు.
వైష్ణోదేవీ భవన్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు, బాధితులకు ఆయన సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని జాతీయ సహీయక నిధి నుంచి రూ. 2 లక్షలేసి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ఆ ఆర్థిక సహాయం అందిస్తామని ప్రధాని కార్యాలయం (PMO) తెలిపింది. గాయపడినవారికి రూ.50 లక్షలేసి ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపింది.
వైష్ణోదేవీ ఆలయంలో జరిగిన సంఘటనలో మరణించినవారికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాను ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. సంఘటన గురించి ప్రధానికి వివరించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలేసి నష్టపరిహారం ఇవ్వనున్నట్లు, గాయపడినవారికి 2 లక్షల రూపాయలేసి అందించనున్నట్లు ఆయన తెలిపారు.
వైష్ణోదేవి ఆలయంలో జరిగిన ఘటనను ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. గాయపడినవారికి సరైన చికిత్స అందించాలని, తగిన సహాయం అందించాలని ప్రధాని ఆదేశించినట్లు చెప్పారు.