
ప్రధాని నరేంద్రమోడీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు.
లోక్సభ ఎన్నికల్లో భాగంగా గురువారం ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. బొగ్గు మాఫియాలో తమ 42 మంది లోక్సభ అభ్యర్ధుల్లో ఎవరైనా ఉన్నట్లు మీరు రుజువు చేస్తే తమ పార్టీ అభ్యర్ధులందరినీ ఉపసంహరించుకుంటానని మోడీకి సవాల్ విసిరారు.
లేదంటే ప్రజల ముందు మీ చెవి పట్టుకుని, 100 గుంజిళ్లు తీయాలన్నారు. ఈ సవాలును స్వీకరిస్తారా..? మీ భార్య గురించి మీరు పట్టించుకున్నట్లయితే మీరు ఇతరుల సంక్షేమం కోసం కూడా పట్టించుకునేవారని మమతా ఎద్దేవా చేశారు.
ఐదేళ్లలో 10 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు.. ఆ ఉద్యోగాలు ఎక్కడ.. పార్లమెంట్ నివేదిక ప్రకారం పశ్చిమ బెంగాల్లో తమ ప్రభుత్వం 40 శాతం నిరుద్యోగాన్ని తగ్గించగలిగిందని మమత స్పష్టం చేశారు.
భారత చరిత్ర గురించి మోడీ తనతో చర్చకు రావాలని మమత ధ్వజమెత్తారు. తాను ప్రధానిని చెంపదెబ్బ కొడతానని ఎప్పుడూ అనలేదని, ప్రజాస్వామ్యం దెబ్బ రుచి చూపిస్తానని మాత్రమే అన్నానని వ్యాఖ్యానించారు.
ముందు భాషను సరిగా అర్ధం చేసుకోండి... ప్రజాస్వామ్యం దెబ్బ అంటే ప్రజల నిర్ణయమని అర్ధం...తాను ప్రధానిని ఎందుకు కొడతానని మమతా బెనర్జీ ప్రశ్నించారు.