''రాపోలు సీతారామ రాజు 'పరావర్తనం'... సాహిత్య పరిశోధకులకు ప్రేరణ''

By Arun Kumar PFirst Published Apr 6, 2022, 9:19 AM IST
Highlights

వేదేశాల్లో వుంటూ కూడా తెెలుగు సాహిత్య సేవ చేస్తున్న  రాపోలు సీతారామ రాజు ను తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరి గౌరీ శంకర్, ప్రముఖ రచయిత దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. 

హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో ఉంటూ తెలుగు సాహిత్యం మీద ప్రేమతో కవితా విమర్శ చేస్తున్న రాపోలు సీతారామ రాజు కృషి అభినందనీయమని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరి గౌరీ శంకర్ అన్నారు. మంగళవారం రవీంద్ర భారతిలో జరిగిన రాపోలు సీతారామ రాజు 'పరావర్తనం' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తెలుగు సాహిత్యం మీద ఇష్టం పెంచడానికి రాపోలు వ్యాసాలు ఉపయోపడతాయని అన్నారు. అన్ని రకాల వాదాల మీద చర్చకు సీతారామరాజు రచనలు తోడ్పడతాయని గౌరీ శంకర్ చెప్పారు.

విశిష్ట అతిథిగా హాజరైన దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ... రాపోలు సీతారామ రాజు రాసిన పరావర్తనం చదివితే ఆయా కవుల పుస్తకాలు చదవాలనే ఆసక్తి కలుగుతుంది అని అన్నారు. మానవ జీవన సారాన్ని వివరించేలా తన  వ్యాసాలు ఉన్నాయని చెప్పారు. ప్రత్యేకంగా ఒక ప్రక్రియ లో రాయడానికి కృషి చేయాలని రాపోలు సీతారామ రాజును కోరారు.  దక్షిణాఫ్రికాలో ఉన్న వివక్ష, సాహిత్యం, జీవితం గురించి రాయాలని అన్నారు.

తెలుగు సాహిత్యం మీద మమకారంతో రాపోలు సీతారామ రాజు చేస్తున్న విమర్శనా వ్యాసంగం ఇక్కడి సాహిత్య విద్యార్థులకు, పరిశోధకులకు ప్రేరణ ఇస్తుంది అని సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ ఎస్. రఘు అన్నారు. 

ప్రముఖ విమర్శకుడు ఎం. నారాయణ శర్మ ప్రసంగిస్తూ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసే దృష్టి గల చక్కని విమర్శకుడు అని అభినందించారు. తెలుగు సాహిత్య విమర్శ సుసంపన్నం కావడానికి రాపోలు సీతారామ రాజు కృషి తోడ్పడుతుంది అని అన్నారు. సాహిత్య విద్యార్థులంతా ఈ పుస్తకం చదవాలి అని కోరారు.  సాగర్ల సత్తయ్య పుస్తకం సమీక్షించారు.


 

click me!