ఎన్నికల కమీషన్ టీఆర్‌ఎస్ తొత్తులా పనిచేస్తోంది...: పొన్నం ఫైర్

By Arun Kumar PFirst Published Jan 22, 2020, 7:39 PM IST
Highlights

కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలుపుకోసం అధికార టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. 

కరీంనగర్ ఎన్నికల నియమాలను తుంగలో తొక్కి ఏ విధంగానైనా గెలవాలని టిఆర్ఎస్ పార్టీ చూస్తుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. నిజంగా నాలుగు సంవత్సరాలు ప్రజలతో మమేకమై ఉంటే ప్రజలే వారినే గెలిపిస్తారని, ఎందుకు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు. కార్పొరేటర్ లను ఓటర్లను కొనడానికి ప్రలోభాలకు గురి చేస్తూ బెదిరింపులకు కూడా వెనుకాడడం లేదన్నారు.

టీఆర్ఎస్ నాయకులకు పదవులు పోతాయని బాధ ఎక్కువ  కనబడుతుందని... అందుకే గెలవడానికి అడ్డదారులు తొక్కుతున్నారన్నారు. గుట్కా మాఫియా, ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, గ్రానైట్ మాఫియా నాయకులకు టికెట్లు ఇచ్చి రంగంలోకి దించారని... ఎన్నికల్లో ఎవరెంత ఖర్చు చేస్తున్నారో చూస్తే తెలుస్తుందన్నారు. 

కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప కరీంనగర్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని... దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఇప్పటివరకు ఎన్నిసార్లు బహిరంగ చర్చకు పిలిచిన రాలేదని... ఇప్పటికైనా సిద్ధమా అని సవాల్ విసిరారు. 

read more  వ్యక్తిగత భద్రతను వదులుకున్న బండి సంజయ్... అందుకేనా...?

కరీంనగర్ లో ప్రతి దానిపై కమిషన్ లు వసూలు చేసి పంచుకున్నారని ఆరోపించారు. నగరంలో పేరుకుపోయిన సమస్యలను, శివారు ప్రాంతాలు అభివృద్ధి, డంపు యార్డ్, సిటీ బస్సులు సమస్యలు గాలికి వదిలేసి కమీషన్లకు పనులు చేస్తున్నారని ఆరోపించారు. చివరకు జాతీయ జెండాపై కూడా కమిషన్లు పంచుకున్న పార్టీ టీఆర్ఎస్ ది అని పొన్నం మండిపడ్డారు. 

ఎన్నికల కమిషన్ కూడా  టిఆర్ఎస్ కు తొత్తు గా పనిచేస్తుందని... రాజ్యాంగ నైతిక విలువలను గాలికి వదిలేసి గులాంగిరి చేస్తుందని విమర్శించారు. ఎంఐఎం,బీజేపీ, టీఆర్ఎస్ అన్ని కలిసే పనిచేస్తున్నాయని అన్నారు.  వీరికి చిత్తశుద్ధి ఉంటే నగర అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.

ప్రజలు కూడా ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కరీంనగర్ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని... మునిసిపల్ ఎలక్షన్ లో మేయర్ స్థానం కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 
 

click me!