జగిత్యాలలో ఐదేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్: తాతకు నెగెటివ్

By telugu teamFirst Published Apr 16, 2020, 8:46 AM IST
Highlights
తెలంగాణలోని జగిత్యాలలో ఓ ఐదేళ్ల బాలుడికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అతన్ని గుంటూరు నుంచి తాత తీసుకుని వచ్చాడు. గ్రామస్తుల ఫిర్యాదుతో వారిద్దరికి పరీక్షలు జరిపించారు.
జగిత్యాల: తెలంగాణలోని జగిత్యాలలో మరో కరోనా వైరస్ పాజిటివ్ కేసు బయటపడింది. ఐదేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. గుంటూరు ఆస్పత్రిలో ట్రాన్సిల్స్ ఆపరేషన్ చేయించి జగిత్యాల మండలంలోని వంజరిపల్లెలో ఉన్న అమ్మానాన్నల వద్దకు అతన్ని తాత మంగళవారం తీసుకుని వచ్చాడు. 

బాలుడి తల్లిదండ్రులు వంజరపల్లెలో మేస్త్రీ పనిచేస్తుంటారు. గ్రామస్తుల ఫిర్యాదుతో తాతను, మనవడిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పరీక్షల కోసం హైదరాబాదుకు నమూనాలను పంపించారు. తాతకు నెగెటివ్ రాగా, మనవడికి పాజిటివ్ వచ్చినట్లు జగిత్యాల ఉప వైద్యాధికారి జైపాల్ రెడ్డి చెప్పారు.

ఐదుగురిపై కేసు నమోదు....

కరీంనగర్ లోని కశ్మీర్ గడ్డ ప్రాంతంలో 05గురు వ్యక్తులు ఒక కిరాణా దుకాణం వద్ద నిత్యావసర వస్తువుల పంపిణీ పేరిట 70కి పైగా జనాలను సమీకరించి, సమావేశాన్ని నిర్వహించడం, ఎలాంటి అనుమతులు లేకుండా నిత్యావసరాల వస్తువులను పంపిణీ చేస్తున్నవారిపై కరీంనగర్ లోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో బుధవారం నాడు కేసు నమోదు చేశారు.

కరీంనగర్లోని హుస్సేనిపురా ప్రాంతానికి చెందిన సయ్యద్ సహా అర్సలాన్, సయ్యద్ అబూజార్, మహమ్మద్ తర్భిజ్ అహ్మద్ ఖాన్, అహ్మద్ పురా కు చెందిన మీర్జా రహమతుల్లా బేగ్, సయ్యద్ అఖిల్ ల పై కేసును నమోదు చేశారు. వ్యక్తుల్లో కొందరికి నిషేధిత పిఎఫ్ఐ సంస్థతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి.

పిఎఫ్ఐ పేరిట ఈ నిత్యావసరాల వస్తువులను పంపిణీ చేస్తున్నారంటూ ముద్రించబడిన డోర్ పోస్టర్లు,ఢిల్లీ లో జరిగిన అల్లర్లలోని వారికి సహాయం కోసం ముద్రించిన ఒక చందాలు స్వీకరించే బుక్కు, రెండు కార్లు, రెండు సెల్ ఫోన్లు, 49 రేషన్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు.ఎస్ఐ స్వరూప్ రాజ్ ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వీరిని విచారిస్తున్నారు.
click me!