నిరుద్యోగులకు శుభవార్త... 3000 ఉద్యోగాలు పక్కా...: మంత్రి గంగుల

Arun Kumar P   | Asianet News
Published : Feb 10, 2020, 04:16 PM IST
నిరుద్యోగులకు శుభవార్త... 3000 ఉద్యోగాలు పక్కా...:  మంత్రి గంగుల

సారాంశం

కరీంనగర్ లో ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసుకున్న ఐటీ టవర్ ను ఫిబ్రవరి 18న  పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. 

కరీంనగర్: స్థానిక యువతకు ఉద్యోగాలను అందించాలన్న ఉద్దేశంతో పాటు నగర అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని కరీంనగర్ లో ఐటి టవర్ నిర్మాణాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినట్లు మంత్రి గంగుల కమలాకర్ పైర్కొన్నారు. ఈ టవర్ నుండి కార్యకలాపాలు జరిపే కంపనీల  వల్ల స్థానికులకు మంచి ఉద్యోగావకాశాలు వస్తాయని... దీనివల్ల ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే బాధ తప్పుతుందన్నారు. 

కరీంనగర్ లో జరుగుతున్న ఐటీ టవర్ నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ లు అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ... ఫిబ్రవరి 18న ఐటి టవర్ ను పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని ప్రకటించారు. 

ఎంప్లాయ్ మెంట్ పెంచుతారని నమ్మకం ఉన్న కంపెనీలకే ఈ ఐటి టవర్ లో కార్యకలాపాలు జరిపే అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఇన్సెంటివ్ లు ఇక్కడ ఇస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం కృషి ఫలితంగా మల్టీ నేషనల్ కంపెనీలు కూడా కరీంనగర్ కు రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయని అన్నారు. 

తొలి రోజునే దాదాపు 400 మంది ఉద్యోగులు కరీంనగర్ ఐటి టవర్ లో పని ప్రారంభిస్తారని తెలిపారు. మరో టవర్ కోసం 3 ఎకరాల భూమిని సిద్ధంగా ఉంచామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే కరీంనగర్ లో ఐటి టవర్ నిర్మించామని మంత్రి వెల్లడించారు. 

read more  కరీంనగర్ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి: పరిహారం కోసం బంధువుల ధర్నా

హైదరాబాద్ లో ఐటి ఉద్యోగం చేసే వ్యక్తికంటే కరీంనగర్ లోని ఐటి ఉద్యోగికి 30 వేల రూపాయల జీవన వ్యయం ఆదా అవుతుందన్నారు. అందువల్ల కరీంనగర్ లో  ఐటీ ఉద్యోగం చేయడానికి విద్యార్ధులు ఆసక్తి కనబరుస్తారని అన్నారు. 

ఈ ఐటీ టవర్ లో కామన్ కాన్ఫరెన్స్ హాల్ ను కూడా ఏర్పాటు చేసామన్నారు. ఐటీ టవర్ వల్ల కరీంనగర్ వాసులకు 80 శాతం ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. మొత్తంగా 3000 నుంచి 3600 మందికి ఇక్కడ ఉపాధి లభించనుందని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే 26 కంపనీలు సంప్రదించగా 15 కంపెనీలతో  ఒప్పందం కూడా చేసుకున్నామని తెలిపారు. 

ఐటీ కార్యాలయాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హై ఫ్రీకెన్సీ ఇంటర్ నెట్, నిరంతర విద్యుత్, పవర్ బ్యాక్ అప్ జనరేటర్, సెంట్రలైజ్డ్ ఏసీ వంటి అధునాతన సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. "కేసీఆర్ ఉండగా .. గల్ఫ్ ఎందుకు దండుగ" నినాదంతో పని చేస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్.

read more   బిజెపి ఎంపీ బండి సంజయ్ సహాయాన్ని కోరిన మంత్రి గంగుల కమలాకర్

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ... 2014 లో తెలంగాణ వచ్చినప్పుడు ఎంతో మంది అభివృద్ధిపై అనుమానాల వ్యక్తం చేసారని గుర్తుచేశారు. వాటిని పటాపంచలు చేస్తూ అనేక పనులను సీఎం  కేసీఆర్ చేసి చూపిస్తున్నారని అన్నారు. 

కంప్యూటర్ శిక్షణ ఇస్తే చాలనుకునే పరిస్థితి నుంచి ఐటీ కంపెనీలు స్థాపించే స్థాయికి కరీంనగర్ ఎదిగిందన్నారు. ఇప్పటికే ఐటీ టవర్ లో 15 కంపెనీలు తమ శాఖలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయని.. తక్కువ జీవన వ్యయంతో ఐటీ ఉద్యోగులకు కరీంనగర్ అనుకూలంగా మారబోతోందని వినోద్ అన్నారు. 

PREV
click me!

Recommended Stories

పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
దుబాయ్‌లో జైలు శిక్ష, విముక్తి: 18 ఏళ్లకు హైద్రాబాద్‌కు, భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు