
కరోనా ఎంతో మంది జీవితాల్ని బలి తీసుకుంటోంది. చాలామంది యుక్తవయస్కులు కూడా కరోనా బారినపడి మృత్యువాత పడ్డ సంఘటనలు అనేకం జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి లక్షలాది మంది మరణించారు. ముఖ్యంగా వృద్ధులు ఎక్కువగా కరోనాకు బలవుతున్న సంగతి తెలిసిందే.
అయితే దీనికి విరుద్ధంగా వయోవృద్ధులు కూడా కరోనాను జయించి.. ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ప్రపంచంలోనే రెండో అత్యధిక వయసు కలిగిన ఓ వృద్ధురాలు కరోనాను జయించి ఎంతో మందికి స్పూర్తిగా నిలిచింది.
వివరాల్లోకి వెళ్తే.. ఫ్రాన్స్కు చెందిన సిస్టర్ ఆండ్రీ అనే అంధురాలు ఆ దేశంలోనే అత్యధిక వయస్సు కలిగిన మహిళ. ప్రపంచంలో రెండో అత్యధిక వయస్కురాలు. ప్రస్తుతం ఆమె సెయింట్ క్యాథరీన్ లాబోర్ రిటైర్ మెంట్ హోమ్ లో ఉంటున్నారు.
గతనెల 16న సిస్టర్ ఆండ్రీ కరోనా బారిన పడ్డారు. ఆమెకు కరోనా సోకిందని తెలియగానే ఆమె సహాయకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కానీ సిస్టర్ ఆండ్రీ మాత్రం ఏమాత్రం భయపడలేదు.
కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఐసోలేషన్ కు వెళ్లి మహమ్మారితో పోరాడుతూ వచ్చింది. ఇలా దాదాపు నెల రోజులు ఐసోలేషన్లో ఉండి కరోనాను జయించింది. వచ్చే గురువారం ఆండ్రీ తన 117వ పుట్టినరోజును జరుపుకోబోతుండడం మరో విశేషం. సిస్టర్ ఆండ్రీ 1904వ సంవత్సరం ఫిబ్రవరి 11న జన్మించారు.