ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ని ఢీకొనడానికి ఉపాధ్యక్ష పదవి కోసం ఎవరి పేరు ముందుకు తీసుకురావాలి అని గత కొన్ని నెలలుగా మల్లగుల్లాలు పడుతున్న బిడెన్... ఎట్టకేలకు కమల హారిస్ పేరును అనూహ్యంగా ప్రకటించాడు.
తనకు ఇప్పటి వరకు దోశ ఎలా వేయాలో కూడా తెలీదంటున్నారు కమల హారిస్. భారత సంతతికి చెందిన కమల హారిస్ అమెరికా ఉపాధ్యక్ష రేసులో నిలిచిన సంగతి తెలిసిందే. డెమొక్రాట్ల తరుఫున ఉపాధ్యక్ష పదవికి ఈ కాలిఫోర్నియా సెనెటర్ ని ఎంపిక చేస్తున్నట్టు డెమొక్రాట్ల తరుఫున అధ్యక్షుడిగా ట్రంప్ తో తలపడుతున్న జో బిడెన్ ప్రకటించారు.
రిపబ్లికన్ల తరుఫున బరిలో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ని ఢీకొనడానికి ఉపాధ్యక్ష పదవి కోసం ఎవరి పేరు ముందుకు తీసుకురావాలి అని గత కొన్ని నెలలుగా మల్లగుల్లాలు పడుతున్న బిడెన్... ఎట్టకేలకు కమల హారిస్ పేరును అనూహ్యంగా ప్రకటించాడు. ఈనేపథ్యంలో అగ్రరాజ్యంలో ఒక నల్లజాతీయురాలికి దక్కిన ఆ అవకాశం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా అమెరికాలో ఉన్న ఇండో- అమెరికన్లు, శ్వేతజాతీయేతరులు, దక్షిణాసియా దేశాల ప్రజలు, డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులు కమలా హారిస్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు కమలా హారిస్ భారత మూలాలను ప్రస్తావిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కమలా హారిస్, మిండీ కాలింగ్ కలిసి భారతీయ(దక్షిణాది) వంటకం దోశ వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లాస్ ఏంజెల్స్లోని కాలింగ్ నివాసంలో తమ తమిళ మూలాల గురించి ప్రస్తావిస్తూ ఇద్దరూ వంట చేసిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోలో దోశ పిండి కలుపుతుండగా తను ఇంతకు ముందెన్నడూ దోశ వేయలేదని కమలా హారిస్ చెప్పుకొచ్చారు. ఇక తమిళ స్పెషల్ వంటకం ఇడ్లీసాంబార్ అంటే తనకెంతో ఇష్టమని ఆమె ఇది వరకే పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. కాగా కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడుకు చెందిన వారు కాగా.. తండ్రి జమైకా నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు.