రాష్ట్రంలో టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఓహియో రాష్ట్రం సరికొత్తగా ఐడియాను వేసింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రజలను ఆకర్షించే విధంగా గవర్నర్ మైక్ డివైన్.. లాటరీ పద్దతిని తీసుకువచ్చారు.
ఆసుపత్రుల కరోనా రోగుల కిటకిటలు, మరణించిన వారి బంధువుల ఆర్తనాదాలు, ఆగకుండా మండుతున్న స్మశాన వాటికలు ప్రస్తుతం ఈ భూమ్మీద ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు. ఎక్కడో చైనాలో పుట్టిన కోవిడ్ మహమ్మారి ఇలాంటి విషాదాలను మిగులుస్తోంది.
ప్రస్తుతం సెకండ్ వేవ్ పేరిట భారత్ సహా ఆయా దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. వైరస్ను కట్టడి చేయాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని నిపుణులు సైతం చెబుతున్నారు. కానీ కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ కొరతగా వుండగా.. మరికొన్ని చోట్ల మాత్రం ప్రజల్లో లేని పోని భయాల కారణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగడం లేదు.
ఈ క్రమంలో జనాన్ని వ్యాక్సిన్ వేయించుకునేలా చేసేందుకు కొన్ని సంస్థలు ఇటీవల ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే కోవలో అమెరికాలో ఓ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా లక్కీ డ్రాని ప్రవేశపెట్టింది.
Also Read:షాకింగ్ : మహిళకు ఒకేసారి ఆరు డోసుల వ్యాక్సిన్.. !
వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఓహియో రాష్ట్రం సరికొత్తగా ఐడియాను వేసింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రజలను ఆకర్షించే విధంగా గవర్నర్ మైక్ డివైన్.. లాటరీ పద్దతిని తీసుకువచ్చారు.
వ్యాక్సిన్ వేయించుకున్న వారిలోంచి వారానికి ఒక విజేతను ఎంపిక చేసి, 1 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.7.3 కోట్లు) బహుమతిగా ఇస్తామని ఆయన ప్రకటించారు. ఇది 18 ఏళ్లు నిండి, కనీసం ఒక్క డోసు టీకా పూర్తి చేసుకున్న వారికే వర్తిస్తుందని మైక్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఇలా చేయడం డబ్బు వృథా అని కొందరు తన నిర్ణయాన్ని తప్పుబట్టే అవకాశం ఉందని.. అయితే "కరోనా సమయంలో ప్రస్తుతం టీకా డోసులు అందుబాటులో ఉన్నా.. కొందరు నిర్ణక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలు కోల్పోవడం ఇంత కన్నా వృథా" అని గవర్నర్ కౌంటరిచ్చారు.
ఇక ఈ టీకా లాటరీలో తొలి విజేతను ఈ నెల 26న ప్రకటిస్తామని మైక్ స్పష్టం చేశారు. ఆ తర్వాతి వారం విజేతను తొలిసారి బహుమానం గెలుచుకున్న విజేత లాటరీ తీసి నిర్ణయిస్తారని గవర్నర్ చెప్పారు. ఇకపోతే సోమవారం నుంచి 12 నుంచి 15 ఏళ్ల వయస్సు గల పిల్లల కోసం ఫైజర్ టీకాకు అమెరికా ఎఫ్డీఏ ఆమోదం తెలిపింది.
దీంతో దేశంలోని 12 నుంచి 15 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా టీకా తీసుకునే 17 ఏళ్లలోపు పిల్లల కోసం కూడా ఓహియో ఓ ప్రత్యేకమైన లాటరీని పెట్టింది. అయితే, ఈ లాటరీ గెలిచిన వారికి నగదు కాకుండా ఏడాది పాటు స్కూల్ స్కాలర్షిప్ చెల్లిస్తారు. ఎందుకంటే ఒహియాలో విద్య అత్యంత ఖరీదైనది.