
US Intelligence: రష్యా, ఉక్రెయిన్ మధ్య దాదాపు 5 నెలలుగా భీకరపోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా రష్యా బలగాల చేతిలో ఉక్రెయిన్ దారుణంగా నష్టపోయింది. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డాయి రష్యా సేనలు. క్రమక్రమంగా అక్కడి ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ యుద్ధంలో వల్ల ఇరు దేశాలు భారీగా నష్టపోయినట్లు వార్తలు వచ్చాయి.
ఈ తరుణంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) సంచలన ప్రకటన చేసింది. ఈ యుద్దంలో ఇప్పటివరకు దాదాపు 15,000 మంది రష్యా సైనికులు మరణించారని, దాదాపు 45 వేల మంది సైనికులు గాయపడినట్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) అంచనా వేసింది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ కూడా భారీగా నష్టపోయిందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్ విలియం బర్న్స్ తాజాగా వెల్లడించింది.
కొలరాడోలోని ఆస్పెన్ సెక్యూరిటీ ఫోరమ్లో విలియం బర్న్స్ మాట్లాడుతూ.. యుఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తాజా అంచనాల ప్రకారం.. ఈ యుద్ధంలో కనీసం 15,000 మంది రష్యన్ సైనికులు మరణించారనీ, దాదాపు 45,000 మంది సైనికులు గాయపడ్డారని తెలిపారు. ఉక్రేనియన్లు కూడా చాలా మందే మరణించారని, అయితే ఈ సంఖ్య రష్యా సైనికుల సంఖ్య కంటే తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.
రష్యా యుద్ద విమానం కూల్చివేత
ఈ యుద్ధంలో ఉక్రెయిన్పై రష్యా తొలుత ఆధిపత్యం చెలాయించినా.. తరువాత ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. రష్యాకు ధీటుగా సమాధానం ఇస్తోంది. ఉక్రెయిన్ దక్షిణ భాగంలోని నోవా కఖోవ్కా నగరం సమీపంలో రష్యా యుద్ధ విమానాన్ని వైమానిక దళం కాల్చివేసినట్లు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ దాడికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఒక యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు చూపిస్తుంది.
సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో ఉక్రెయిన్ విడిచిన ఓ మెస్సెల్ రష్యా ఫైటర్ జెట్ కు తాకి కొద్దిసేపటికే నేలపై పడింది. ఈ విమానం నేలపై పడగానే ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. దీని తరువాత నల్లటి పొగతో కూడిన మంటలు పైకి లేచాయి.
అదే సమయంలో రష్యా ఆక్రమిత దక్షిణ ఉక్రెయిన్లో సరఫరా మార్గానికి ముఖ్యమైన వంతెనపై ఉక్రేనియన్ సైన్యం దాడి చేసి దెబ్బతీసింది. రష్యా-ఆక్రమిత దక్షిణ ఉక్రెయిన్లోని ఖెర్సన్ ప్రాంతంలో మాస్కో-మద్దతుగల పరిపాలనా విభాగం అధిపతి కిరిల్ స్ట్రెమోసోవ్ మాట్లాడుతూ.. ఉక్రేనియన్ దళాలు డ్నీపర్ నదిపై ఉన్న వంతెనపై క్షిపణులను ప్రయోగించాయని, వాటిలో 11 వంతెనను ధ్వంసం చేసినట్టు తెలిపారు. దాదాపు 1.4 కి.మీ పొడవున్న వంతెనకు భారీ నష్టం వాటిల్లిందని, అయితే ట్రాఫిక్ కోసం మూసివేయలేదని ఆయన చెప్పినట్లు ఇంటర్ఫాక్స్ వార్తా సంస్థ పేర్కొంది.