
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో పశ్చిమ దేశాలు ఆయుధ సంపత్తి పెరిగిందని, వాటిని నాశనం చేస్తామని, ఉక్రెయిన్లో రష్యా మాట్లాడే వారిని రక్షిస్తామనే ప్రకటనలు చేసి వ్లాదిమిర్ పుతిన్ ‘మిలిటరీ చర్య’ను ప్రారంభించాడు. ఉక్రెయిన్ పౌరులు తమ టార్గెట్ కాదనీ, కేవలం వారి మిలిటరీ బేస్లే లక్ష్యం అంటూ రష్యా మిలిటరీ సరిహద్దు దాటి ఆ దేశంలోకి ప్రవేశించింది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఈ యుద్ధం కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు ఫక్తు దురాక్రమణ వైపు
రష్యా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర జెలెన్స్కీ అదే మాట అన్నాడు.
ఉక్రెయిన్ నుంచి స్వతంత్రంగా జీవిస్తామని పేర్కొంటూ 2014లో ఏర్పడ్డ రెండు ప్రాంతాలు లుహాన్స్క్, దొనెత్స్క్లు ఉక్రెయిన్లోని దొన్బాస్ రీజియన్లో ఉన్నాయి. ఉక్రెయిన్లో ఈ యుద్ధానికి ముందు నుంచీ కూడా ఘర్షణాత్మకంగా ఉన్న రీజియన్ ఇది. ఉక్రెయిన్ భౌగోళికం దృష్ట్యా పశ్చిమ ప్రాంత ప్రజలు యూరప్ వైపు.. తూర్పు ప్రాంత ప్రజలు రష్యా వైపు మొగ్గు చూపుతుంటారు. తూర్పు ఉక్రెయిన్ ప్రాంత ప్రజలు ఉక్రెయినియన్ భాష కంటే కూడా రష్యా భాషనే ఎక్కువ మాట్లాడుతుంటారు. ఉక్రెయిన్ యూరప్ వైపు
మొగ్గుచూపడాన్ని వారు తట్టుకోవడం లేదు. అందుకే ముఖ్యంగా రష్యా సరిహద్దుకు ఆనుకుని ఉండే దొన్బాస్ రీజియన్లోని లుహాన్స్క్, దొనెత్స్క్ ప్రాంతాలు ఉక్రెయిన్ నుంచి స్వతంత్ర ప్రకటించుకున్నాయి. రష్యా వైపు అవి మొగ్గుచూపుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లోని వేర్పాటువాదులకు రష్యా సహకారం అందిస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి.
ఉక్రెయిన్ నాటోలో చేరితే ఈ రెండు ప్రాంతాలకూ ముప్పు తప్పదని, రష్యా మాట్లాడేవారిని తాము కచ్చితంగా రక్షించుకుంటామని చెబుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై మిలిటరీ ఆపరేషన్కు దిగాడు. అంతేకాదు, ఈ లుహాన్స్క్, దొనెత్స్క్ ప్రాంతాలనూ స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించడం గమనార్హం. కాబట్టి, ఉక్రెయిన్పై రష్యా మిలిటరీ ఆపరేషన్ మొదలు పెట్టినప్పటి నుంచి ఉక్రెయిన్ ప్రభుత్వం ఈ రెండు ప్రాంతాలపై దృష్టి నిలిపే ఉంచింది. రష్యా ఈ యుద్ధం చివరిలోనైనా ఆ రెండు ప్రాంతాల కోసం పోరాడుతుందనే ఆలోచనలోనే ఉన్నది.
దొన్బాస్ రీజియన్నూ సాధించుకుంటే... రష్యా ఇది వరకే ఆక్రమించుకున్న క్రిమియాకూ నేరుగా రాకపోకలు సాగించే వెసులుబాటు రష్యాకు ఏర్పడుతుంది. ఉక్రెయిన్లోని క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నా.. అది ఒంటరిగా మధ్యలో ఉన్నది. ఈ దొన్బాస్ రీజియన్ ఆక్రమణతో క్రిమియా వరకు రష్యా ఒక ల్యాండ్ కారిడార్ను ఏర్పరుచుకోగలదు.
ఇప్పుడు రష్యా దొన్బాస్ రీజియన్పై దాడిని కేంద్రీకరిస్తున్నట్టు తెలుస్తున్నది. దొన్బాస్ తూర్పు ఏరియా మొత్తాన్ని రష్యా నాశనం చేయాలని అనుకుంటున్నదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అన్నాడు. దొన్బాస్ రీజియన్ కోసం రష్యా ఆర్మీ దాడులు ప్రారంభించిందని తాము ధ్రువీకరిస్తున్నామని, ఈ దాడి కోసం వారు దీర్ఘకాలంగా ప్రిపేర్ అవుతున్నారని పేర్కొన్నాడు. ఈ రోజు ఉదయం దొనెత్స్క్, లుహాన్స్క్, ఖార్కివ్ రీజియన్లలో తమ బలగాలను మట్టికరిపించాలని దురాక్రమణదారులు ప్రయత్నించారని ఆరోపించాడు.
దొన్బాస్ రీజియన్లో రష్యా భీకర దాడులకు సిద్ధం అయిందని అన్నాడు. రష్యా షెల్లింగ్ దాడుల్లో దొనెత్స్క్లో నలుగురు మరణించినట్టు అక్కడి గవర్నర్ తెలిపాడు.