
ఫిలిప్పీన్స్లో (Philippines) రాయ్ తుపాన్ (Typhoon Rai) బీభత్సం సృష్టిస్తోంది. తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న ఈ తుపాన్ 75 మంది ప్రాణాలను బలితీసుకుంది. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 3 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను, బీచ్ల వద్ద ఉన్న రిసార్ట్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. తుపాన్ ప్రభావంతో ఫిలిప్పీన్స్లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించింది. చాలా గ్రామాలకు వరదలు ముంచెత్తాయి.. కరెంట్ స్తంభాలు నెలకొరిగాయి. రోడ్లపై భారీ వృక్షాలు పడిపోయాయి.
ఈ సూపర్ టైపూన్ ప్రభావంతో గంటకు 195 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయడం చాలా చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. పైకప్పులు ఎగిరిపోయాయి. ఫిలిప్పీన్స్లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బోహోల్ దీవిపై రాయ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్నట్టుగా గవర్నర్ ఆర్థర్ యప్ (Arthur Yap) తెలిపారు. తుఫాన్ కారణంగా 49 మంది చనిపోయారని తన ఫేస్బుక్ పోస్ట్లో వెల్లడించారు. ద్వీపంలో పది మంది ఆచూకీ తెలియడం లేదని, 13 మంది గాయపడ్డారని గవర్నర్ తెలిపారు. కమ్యూనికేషన్ వ్యవస్థ ఇంకా డౌన్లోనే ఉందని చెప్పారు.
ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన ప్రజలకు ఆహారం అందజేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా విద్యుత్ వ్యవస్థను పునరుద్దరించడానికి, రోడ్డు మార్గంలో పడిన భారీ వృక్షాలను తొలగించడానికి భారీ యంత్రాల సాయం తీసుకుంటున్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో త్వరితగతిన కనీస వసతులను పునరుద్దరించడానికి చర్యలు చేపట్టినట్టుగా అధికారులు తెలిపారు. ఫిలిప్పీన్స్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. స్వచ్ఛంద సంస్థలు విరాళాల కోసం విజ్ఞప్తి చేస్తున్నాయి.
రాయ్ ప్రభావంతో దేశవ్యాప్తంగా కుండపోత వర్షం కురిసిందని, చెట్లు నెలకొరిగాయని, చెక్కతో నిర్మించిన ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయిన అధికారులు తెలిపారు. ప్రస్తుతం తుపాన్ వేగం గంటలకు 150 కి.మీలకు తగ్గిందని వెల్లడించారు.
ఇక, ఫిలిప్పీన్స్లో 2013లో చోటుచేసుకన్న హైయాన్ సూపర్ టైపూన్ను గుర్తుకు తెచ్చేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సియార్గావ్, దినాగట్, మిండనావో ద్వీపాలలో కూడా రాయ్ టైపూన్ బీభత్సం సృష్టించిందని చెబుతున్నారు. అయితే హైయాన్ టైపూన్ అంత భారీ నష్టం కలగకపోవచ్చని దినాగట్ గవర్నర్ అర్లీన్ బాగ్-ఆవో శనివారం తెలిపారు. ఇక, సూపర్ టైఫూన్ హైయాన్ ఫిలిప్పీన్స్పై ఓ రేంజ్లో పంజా విసిరింది. దాదాపు 7,300 మందికి పైగా మరణిండం లేదా కనిపించకుండా పోయారని రికార్డులు చెబుతున్నాయి.
ఇక, మానవులు చేస్తున్న ప్రకృతి విధ్వంసం.. వాతావరణ మార్పులకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. భూగోళం వెడేక్కుతున్నందున.. టైపూన్లు మరింత శక్తివంతంగా విరుచుకుపడతాయనే ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఫిలిప్పీన్స్పై ప్రకృతి విపత్తుల ప్రభావం అధికంగా ఉంటుంది.