
అమెరికాలో ఉద్యోగం సంపాదించి జీవితంలో సెటిల్ అవ్వాలని చాలా మంది ఐటీ కంపెనీ ఉద్యోగులు కలలు కంటూ ఉంటారు. అయితే.. వారి కలలపై ట్రంప్ మరోసారి నీళ్లు చల్లారు. ఇప్పటికే హెచ్1 బీ లపై ట్రంప్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా.. హెచ్1బీ వీసాలో ఉన్నవారిని నియమించే ఫెడరల్ ఎజెన్సీలపై ట్రంప్ ఫోకస్ చేశారు. ఇక నుంచి హెచ్1 వీసాదారులకు నియామకం కల్పించే అవకాశం.. ఫెడరల్ ఏజెన్సీలకు లేకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు.
కాగా.. ఇప్పటికే.. హెచ్1 బీ వీసాల విషయంలో ట్రంప్ చాలా మార్పులు చేశారు. అత్యంత నైపుణ్యం ఉన్నవారికే ఈ వీసాను ఇవ్వనున్నారు. ఈ వీసా జారీ చేయాలంటే ఆ వ్యక్తి వీసాకు దరఖాస్తు చేసుకున్న సమయంలో అతను పని చేస్తున్న కంపెనీ జీతాన్ని కచ్చితంగా పెంచి ఉండాలి.
మరోవైపు, హెచ్-1బీ వీసాదారుల కుటుంబసభ్యులు అమెరికాలో ఉద్యోగం చేయడానికి అనుమతినిచ్చే హెచ్4 వీసాలను పూర్తిగా రద్దు చేయనున్నట్టు తెలుస్తున్నది. స్టూడెంట్ వీసాల గడువుపై నిర్దిష్ట కాలపరిమితిని విధించాలని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రతిపాదించింది.
గడువు ముగిసిన తర్వాత విదేశీ విద్యార్థులను వారి సొంత దేశాలకు తిప్పి పంపాలని సూచించింది. విద్యార్థులు తమ విద్యాభ్యాసం ముగిసిన తర్వాత కొన్నాళ్లు ఉండి శిక్షణ పొందడానికి ఇచ్చే ఓపీటీ వీసాల దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని ప్రతిపాదించింది.
ఇదిలా ఉంటే హెచ్-1బీ వీసాల రద్దుతో భారత ఐటీ కంపెనీలపై రూ.1,200 కోట్ల వరకు భారం పడనున్నది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీల లాభాలూ 0.25 శాతం నుంచి 0.30 శాతం వరకు తగ్గనున్నాయని రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేస్తోంది. మరోవైపు కొవిడ్-19 వల్ల ఈ ఏడాది భారత ఐటీ కంపెనీల లాభాలకు 23 శాతం గండిపడనుందని, హెచ్-1బీ వీసాల రద్దు భారం దీనికి అదనమని క్రిసిల్ వెల్లడించింది.
తాజాగా ట్రంప్ నిర్ణయంతో వీసాలపై భారత ఐటీ నిపుణుల్ని అమెరికా తీసుకెళ్లి, అక్కడి తమ ఐటీ యూనిట్లలో పని చేయించుకునే అవకాశం భారత ఐటీ కంపెనీలకు పోయింది. అవసరమైన ఉద్యోగుల్ని 25 శాతం అధిక జీతాలతో స్థానికులతోనే భర్తీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ట్రంప్ సర్కార్ అధికారం చేపట్టినప్పటి నుంచే అమెరికాలోని భారత ఐటీ కంపెనీలు జాగ్రత్త పడ్డాయి. హెచ్-1బీ వీసాల తిరస్కరణ రేటు పెరిగి పోవడంతో స్థానికుల్నే పెద్ద సంఖ్యలో ఉద్యోగాల్లోకి తీసుకోవడం ప్రారంభించాయి.
దీంతో ప్రస్తుతం అమెరికాలోని టాప్-5 భారత ఐటీ కంపెనీల ఉద్యోగుల్లో హెచ్-1 బీ వీసాలపై వచ్చిన వారు 5 శాతానికి మించి లేరని క్రిసిల్ పేర్కొంది. 2017లో 30-35 శాతం ఉన్న స్థానికుల నియామకం ప్రస్తుతం 60 శాతానికి చేరింది.