
చైనాలో విషాదం చోటు చేసుకుంది. నైరుతి ప్రావిన్స్ సిచువాన్ లో ఆదివారం ఓ పర్వతం కూలింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారని ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లోని లెషాన్ లో ప్రభుత్వ ఆధీనంలోని అటవీ క్షేత్రంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు గల్లంతయ్యారు.
నగరంలోని జింకోహే జిల్లాలోని యోంగ్షెంగ్ టౌన్షిప్లోని అటవీ క్షేత్రంలో ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ‘జిన్హువా’ వార్తా సంస్థ తెలిపింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక అధికారులు తెలిపారు. 14 ప్రత్యేక రెస్క్యూ పరికరాలతో 180 మందికి పైగా రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దింపినట్లు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన వార్తాపత్రిక పీపుల్స్ డైలీ ఆధ్వర్యంలో కొనసాగే రోజువారీ టాబ్లాయిడ్ ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది.
పర్వత శిథిలాలు పడిపోయి చుట్టుపక్కల నిర్మాణాలపై పడ్డాయని తెలిపింది. ఇందులో పలు వసతి గృహాు కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన బాధితుల్లో ఎక్కువ మంది ఇతర ప్రాంతాలకు చెందినవారేనని స్థానికులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఈ కుగ్రామం మునిగిపోయిందని అన్నారు. కాగా.. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘనటకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.