
Sri Lanka cuts petrol, diesel prices: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రజలకు ఉపశమనం కలిగించేలా చమురు ధరలు తగ్గించబడ్డాయి. ఇంధనం కోసం ప్రతిరోజు కిలోమీటర్ల పొడవునా క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితుల మధ్య అక్కడి ప్రభుత్వ యాజమాన్యంలోని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీ), లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఎల్ఐఓసీ) ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేలా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నాయి. ఆక్టేన్ 92 పెట్రోల్ ధర ఇప్పుడు లీటరుకు 450 శ్రీలంక రూపాయలు. దీనిపై ప్రభుత్వం 20 రూపాయల తగ్గింపును ప్రకటించింది. అలాగే, ఆక్టేన్ 95 పెట్రోల్ లీటరుకు 540 రూపాయలకు విక్రయించబడుతోంది. దీనిపై 10 రూపాయలు తగ్గించారు.
డీజిల్ ధరలు కూడా తగ్గించబడ్డాయి. డీజిల్ లీటరుకు 20 రూపాయలు తగ్గించడంతో ప్రస్తుతం అది 440 రూపాయలకు చేరుకుంది. సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ఈ ఏడాది ఫిబ్రవరి నుండి ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. తీవ్రమైన విదేశీ మారకద్రవ్య సంక్షోభంతో పాటు ఈ సంవత్సరం రుణ చెల్లింపుల్లో బిలియన్ల డిఫాల్ట్కు దారితీసింది. ఈ క్రమంలోనే నిత్యావసరాలైన ఆహారం, మందులు వంటి వాటి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంక్షోభం పౌరుల నుండి భారీ, హింసాత్మక నిరసనలను ప్రేరేపించింది. ఇది రాజకీయ అశాంతికి దారితీసింది. ఈ చర్యలు మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే దేశం నుండి పారిపోవడానికి.. ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక నాయకుడిగా నియమించడానికి దారితీసింది.
కొనసాగుతున్న ఇంధన కొరతల మధ్య భారతదేశం సరఫరాను పొడిగించినప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు. దీంతో చాలా మంది లంక వాసులు తమ కార్లు, మోటార్ సైకిళ్లకు గుడ్ బై చెబుతున్నారు. గత నెల చివరిలో CPC ప్రైవేట్ వాహనాలకు ఇంధన పంపిణీని నిలిపివేసింది. తదుపరి పెట్రోల్, డీజిల్ షిప్మెంట్లు వచ్చిన తర్వాత ఇది పంపిణీని పునఃప్రారంభిస్తుందని పేర్కొంది. మార్చి నుంచి శ్రీలంక కరెన్సీ 80 శాతం క్షీణించింది. దీంతో దివాలా తీసినట్టు ప్రకటించి.. అంతర్జాతీయ సాయం కోరుతోంది.
కాగా, దేశం విడిచి పారిపోయిన గోటబయ రాజపక్సే రాజీనామాను పార్లమెంటు ఆమోదించిన తర్వాత శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బుధవారం మాల్దీవులకు పారిపోయి, గురువారం సింగపూర్లో అడుగుపెట్టిన రాజపక్సే అధికారికంగా రాజీనామా చేశారని స్పీకర్ మహింద యాపా అబేవర్ధనా శుక్రవారం తెల్లవారుజామున ధృవీకరించారు. సంక్షోభంలో ఉన్న దేశంలో 72 గంటల గందరగోళాన్ని తెరపడింది. ఈ సమయంలో నిరసనకారులు రాష్ట్రపతి, ప్రధాన మంత్రి నివాసాలతో సహా అనేక ఐకానిక్ భవనాలపై దాడి చేశారు. రాజపక్సే, తన రాజీనామాను స్పీకర్ అబేవర్దనకు ఇమెయిల్ పంపారు. అతను తన రాజీనామాను ఆమోదించినట్లు చెప్పాడు. ఆయన రాజీనామాతో దాదాపు 20 ఏళ్లపాటు దేశంలో అధికారంలో ఉన్న కుటుంబం పాలనకు తెరపడింది. ఈ నేపథ్యంలోనే శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.