పాకిస్తాన్లో పేషావర్లోని మసీదులో ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 93కు పెరిగింది. సూసైడ్ బాంబర్ తల తెగిపడినట్టు అధికారులు భావిస్తున్నారు. ఆ తలను రికవరీ చేశామని వివరించారు.
పేషావర్: పాకిస్తాన్లో పేషావర్లోని భద్రత కట్టుదిట్టంగా ఉండే మసీదులో సోమవారం మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 93కు పెరిగింది. 221 మందికి తీవ్ర గాయాలైనట్టు పాకిస్తాన్ పోలీసు అధికారులు వెల్లడించారు. శిథిలాల కింది నుంచి మృతదేహాలను వెలికి తీసే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలోనే సూసైడ్ బాంబర్కు చెందిన తెగి పడిన తల లభించినట్టు అధికారులు వివరించారు.
క్యాపిటల్ సిటీ పోలీసు ఆఫీసర్ పేషావర్ మొహమ్మద్ ఎజాజ్ ఖాన్ జియో టీవీతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పేలుడు ఒక ఆత్మాహుతి దాడి అయి ఉంటుందని వివరించారు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి తల పేషావర్ స్పాట్ నుంచి రికవరీ చేసుకున్నామని తెలిపారు.
పేలుడు సంభవించిన ప్రాంతం కట్టుదిట్టంగా భద్రత ఉండే పోలీస్ లైన్స్ ఏరియా కావడంతో పేలుడు సంభవించడం మరింత కలకలం రేపింది. దాడికి ముందే ఆ సూసైడ్ బాంబర్ పోలీసు లైన్స్ ఏరియాకు వచ్చి ఉంటాడని ఆయన తెలిపారు. అధికారుల వాహనాన్ని ఉపయోగించుకునే అతను పోలీసు లైన్స్ ఏరియాలోకి ఎంటర్ అయి ఉండొచ్చని వివరించారు.
ఈ పేలుడు ఒక ప్రతీకార చర్య అని తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ టెర్రరిస్టు ఉమర్ ఖాలీద్ ఖురసానీ తెలిపాడు. అఫ్గానిస్తాన్లో తన సోదరుడిని చంపేశారని, అందుకు ప్రతీకారంగానే ఈ ఆత్మాహుతి దాడి అని పేర్కొన్నాడు.