
Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై నెల రోజులు అవుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్లోని అనేక నగరాలు ధ్వంసమయ్యాయి. ఈ యుద్దం కారణంగా.. లక్షలాది మంది ప్రజలు తమ ప్రాణాలను చేతిలో పట్టుకుని.. పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు. ఇరు దేశాల మధ్య పలు మార్లు చర్చలు జరిగిన ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. పరిష్కారం దిశగా వెళుతున్నట్టు కనిపించడం లేదు. యుద్దం నిలిపివేయాలని ప్రపంచ దేశాలు, అటు ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేసినా.. రష్యా ఏమాత్రం తగ్గడం లేదు.
ఈ తరుణంలో రష్యా కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్ - రష్యాల దాడిలో 1,351 మంది రష్యా సైనికులు మరణించారని, అదే సమయలో 3,825 మంది సైనికులు గాయపడ్డారని తెలిపింది. ఈ యుద్ద ప్రభావం వల్ల దాదాపు 4 లక్షల మందికి పైగా పౌరులను ఉక్రెయిన్ ను విడిచి వెళ్లిపోయారని వెల్లడించింది. కైవ్కు పాశ్చాత్య ఆయుధాల సరఫరాలను ఖండిస్తున్నట్లు పేర్కొంది.
వేర్పాటువాద తూర్పు డొనెట్స్క్, లుగాన్స్క్ ప్రాంతాలతో పాటు ఉక్రెయిన్లోని మిగిలిన ప్రాంతాల నుండి 419,736 మంది పౌరులను రష్యాకు తరలించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి మిఖాయిల్ మిజింట్సేవ్ తెలిపారు. వీరిలో 88,000 మందికి పైగా చిన్నారులు ఉండగా, 9,000 మంది విదేశీయులున్నారని తెలిపారు. అలాగే..రష్యా అన్ని దిశలలో యూమన్ కారిడార్లను తెరిచిందనీ, వారికి సహాయం కొనసాగిస్తుందని మిజింట్సేవ్ చెప్పారు.
ఉక్రెయిన్ కు పాశ్చాత్య దేశాలు ఆయుధాలను సరఫరా చేయడం తప్పుగా భావిస్తున్నామని రష్యా జనరల్ స్టాఫ్ సీనియర్ ప్రతినిధి సెర్గీ రుడ్స్కోయ్ అన్నారు. ఇలాంటి చర్యల వల్లే.. సంఘర్షణలు ఇంకా సాగుతున్నాయనీ, బాధితుల సంఖ్యను పెంచుతుందని, ఆపరేషన్ ఫలితాన్ని ప్రభావితం చేయదని రుడ్స్కోయ్ అన్నారు. యుద్ద సామాగ్రి పంపించడం వెనుక నిజమైన ఉద్దేశ్యం.. ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వడం కాదనీ, ఇరు దేశాల మధ్య యుద్దాన్ని మరిన్ని రోజులు పొడగించడమేనని అన్నారు.
నాటోలోని కొన్ని సభ్య దేశాలు గగనతలాన్ని మూసివేయాలని సూచించాయి. రష్యా సాయుధ బలగాలు దానికి అనుగుణంగా స్పందిస్తాయని అన్నారు. ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కూడా తన దేశంపై నో ఫ్లై జోన్ను విధించాలని నాటోను పదేపదే కోరుతున్నట్టు గుర్తు చేశారు. రష్యా.. ఉక్రెయిన్ మొత్తం భూభాగంపై యుద్దం చేస్తోందని రుడ్స్కోయ్ చెప్పారు. ఇదిలా ఉంటే.. గత నెల రోజుల యుద్దంలో 14,000 మంది ఉక్రెయిన్ సైనికులను కోల్పోయిందని, అదే సమయంలో 16,000 మంది గాయపడ్డారని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు.. ఐక్యరాజ్యసమితి (United Nations) కీలక ప్రకటన చేసింది. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్లో ఇప్పటివరకు 1035 మంది సామాన్య పౌరులు మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి గురువారం వెల్లడించింది. ఇందులో 90 మంది చిన్నారులు ఉన్నారని తెలిపింది. ఈ యుద్ధంలో మరో 1650 మంది గాయపడ్డరాని వెల్లడించారు.