
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గత 11 రోజులుగా ఉక్రెయిన్ కీలక నగరాలు, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపిస్తుంది. క్షిపణి దాడులతో విరుచుకుపడుతుంది. కొన్నిచోట్ల మాత్రం రష్యా బలగాలను ఉక్రెయిన్ సైన్యం, ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుంది. అయితే రష్యా ఉక్రెయిన్పై దాడి చేస్తున్నప్పటికీ.. ఆ దేశం వైపు నష్టం భారీగానే ఉందని ఉక్రెయిన్ చెబుతుంది. ఇప్పటివరకు 11 వేలకు పైగా రష్యా బలగాలు మరణించినట్టుగా ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి.
ఇప్పటివరకూ 285 రష్యన్ ట్యాంకులను ధ్వంసం చేశామని తెలిపింది. 11,000కు పైగా రష్యన్ సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. అలాగే.. 50 రాకెట్ లాంచర్లను, 44 యుద్ద విమానాలు, 48 రష్యన్ హెలికాఫ్టర్లను కూల్చామని వెల్లడించింది. 985 సాయుధ క్యారియర్లను ధ్వంసం చేశామని, 60 ఫ్యూయల్ ట్యాంకులను పేల్చివేశామని, 447 కార్లను, 21 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ వార్ఫేర్ను ధ్వంసం చేశామని పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఒక రోజు ముందు 10 వేల మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టినట్టుగా ఉక్రెయిన్ ఆర్మీ చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక, ఉక్రెయిన్పై రష్యా మిలటరీ ఆపరేషన్ నేపథ్యంలో సుమారు 10 మిలియన్ జనాభా ఉక్రెయిన్ నుండి వలస వెళ్లి ఉంటారని UNO అంచనా వేసింది. కొన్ని కుటుంబాలు సెంట్రల్ బుడాఫెస్ట్లోని న్యుగటి రైల్వే స్టేషన్ గుండా సరిహద్దులకు చేరుకొంటున్నారు. ఇక్కడ స్వచ్ఛంధ సేవా సంస్థలు ఆహారం, వస్తువులను వలసదారులకు సరఫరా చేస్తున్నారు. మరో వైపు మరికొందరు శరణార్ధులు జకర్పట్టియా ఒబ్లాస్ట్ నుండి తూర్పు ఉక్రెయిన్లోని సరిహద్దు గుండా వలస వెళ్తున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. నల్ల సముద్రంలోని ఓడరేవు నగరమైన ఒడెస్సా నుండి కూడా కూడ కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని యూఎన్ఐ ప్రకటించింది.
ఉక్రెయిన్పై దాడులను ఆపాలని పలు దేశాలు రష్యాను కోరుతున్నాయి. కానీ పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అంతా ఆలోచించే తాము రంగంలోకి దిగినట్టుగా ఆయన చెబుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఆంక్షలకు కూడా పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ఆంక్షలు విధించిన దేశాలపై ఆయన కూడా ఆంక్షలు విధిస్తున్నారు.