
భారతీయ పౌరులను ఉక్రెయిన్ (Ukraine) నుంచి ఇండియాకు తిరిగి తీసుకురావడానికి కైవ్ (Kyiv) కు వెళుతున్న ఎయిర్ ఇండియా (air india)విమానం గురువారం ఉదయం మధ్యలోనే వెనక్కి వచ్చేసింది. రష్యా దళాలు మూడు దిశల నుండి ఆ దేశంపై దాడి చేయడంతో ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసివేసింది. ఈ కారణంతో రష్యా గగనతలాన్ని మూసివేసిన్నట్టు ప్రకటించడంతో ఎయిర్ ఇండియా ఉక్రెయిన్ లో ల్యాండ్ కాలేకపోయింది. ఉక్రెయిన్ నుండి దాదాపు 18,000 మంది భారతీయ పౌరులను, విద్యార్థులను స్వదేశానికి రప్పించడానికి భారతదేశం బుధవారం ప్రారంభించిన ప్రత్యేక ఫెర్రీ సేవలలో ఈ విమానం ఒకటి.
AI 1947 ఉదయం 7.30 గంటలకు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (indira gandhi international air port) నుండి బయలుదేరింది. రెండు గంటల పాటు గాలిలో ప్రయాణం చేసిన అనంతరం అది తిరిగివచ్చింది. ఈ వారంలో ఎయిర్ ఇండియా సంస్థ నుంచి ఉక్రెయిన్ వెళ్లేందుకు ప్లాన్ చేసిన రెండో స్వదేశీ విమానం ఇది. ఇదే సంస్థకు చెందిన ఓ విమానం మంగళవారం 242 మంది ప్రయాణికులను తిరిగి తీసుకువచ్చింది.
ఉక్రేనియన్ స్టేట్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ ఎంటర్ప్రైజ్ గురువారం తెల్లవారుజామున విమానయాన భద్రత, ప్రమాదం కారణంగా పౌర వినియోగదారుల కోసం ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే గగనతల నిషేధానికి కొన్ని గంటల ముందు కైవ్ నుండి బయలుదేరి ఉదయం 7.45 గంటలకు ఢిల్లీలో దిగిన ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విమానంలో 182 మంది భారతీయ పౌరులు ఇండియాకు చేరుకున్నారు.
అయితే ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడం వల్ల ఉక్రెయిన్లోని వివిధ నగరాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు సవాలుగా మారింది. రష్యా హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు, క్షిపణుల ద్వారా పెద్ద ఎత్తున బాంబు దాడులు చేస్తుండటంతో వారంతా భయం గుప్పిట్లో బతుకుతున్నారు. అనుక్షణం భయం భయం గా జీవిస్తున్నారు. ఎక్కడి నుంచి ఏ బాంబు వచ్చి పడుతుంతో అని ఆందోళన చెందుతున్నారు. ‘‘ మేము ఇంకా కైవ్లో ఉన్నాము. బోరిస్పిల్ విమానాశ్రయం వైపు నుండి 15 నిమిషాల క్రితం పెద్ద చప్పుడు పేలుడు సంభవించింది. ఈ సౌండ్ తో మేల్కొన్నాము.’’ అని ఉక్రెయిన్ లో ఉంటున్న ఓ స్టూడెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బోరిస్పిల్ అనేది కైవ్ లో అతిపెద్ద విమానాశ్రయం.
సుమీ స్టేట్ యూనివర్శిటీకి చెందిన మరో ఇండియన్ స్టూడెంట్ పన్మన ఆనందు కూడా ఇలాంటి పోస్ట్ ఒకటి పెట్టారు. తాము ఇండియాకు బయలుదేరామని అన్నారు. గురువారం ఉదయం రష్యా దళాలు బాంబులతో దాడి చేసిన ఖార్కివ్, డెసాలలో చాలా మంది భారతీయులు ఉన్నారని చెప్పారు. ఆసుపత్రులకు రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని తమ యూనివర్సిటీ విద్యార్థులకు పిలుపునిచ్చిందని ఆనంద్ తెలిపారు.
ఆందోళనకరమైన పరిస్థితి వల్ల ఉక్రెయిన్లోని ప్రధాన నగరాల్లోని భూగర్భ మెట్రో స్టేషన్లలో ఆశ్రయం పొందేందుకు భారతీయ విద్యార్థులను సూచించింది. ఉక్రెయిన్ భూ సరిహద్దుల ద్వారా తరలింపు కోసం నాలుగు పొరుగు దేశాలలో ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు గురువారం ఉదయం కైవ్లోని భారత రాయబార కార్యాలయానికి చేరుకుని ఆశ్రయం పొందారు. వారిలో కొందరికి మిషన్ ప్రాంగణంలో వసతి లభించగా, మిగిలిన వారిని సమీపంలోని సురక్షిత నివాసాలకు పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.