
పాకిస్తాన్ (Pakistan) మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (Pervez Musharraf ) ఆరోగ్య పరిస్ధితిపై మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముషారఫ్ కుటుంబం ట్విట్టర్ ద్వారా స్పందించింది. ‘‘ ఆయన వెంటిలేటర్పై లేరని.. కానీ ముషారఫ్ అమిలోయిడోసిస్ కారణంగా గత 3 వారాలుగా ఆసుపత్రిలో వున్నారు. కోలుకోవడం కష్టమేనని.. ఇప్పటికే అవయవాలు పనిచేయని దశకు చేరుకున్నారని , ఈ దశలో ఆయన రికవరీ కావాలని భగవంతుడిని ప్రార్థించాలంటూ’’ ముషారఫ్ కుటుంబ సభ్యులు ట్వీట్ చేశారు.
కాగా.. పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్యం అత్యంత విషమంగా వున్నట్లు జాతీయ , అంతర్జాతీయ మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన దుబాయ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ముషారఫ్ ఆరోగ్య పరిస్ధితి బాగా విషమించినట్లుగా కథనాలు వస్తున్నాయి. కొన్ని ఛానెళ్లలో ఆయన మరణించినట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే ముషారఫ్ కుటుంబ సభ్యులు స్పందించారు.
అవిభక్త భారతదేశంలోని ఢిల్లీలో 1943 ఆగస్టు 11న జన్మించిన ముషారఫ్ కుటుంబం.. దేశ విభజన అనంతరం పాకిస్తాన్కు వలస వెళ్లింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఆర్మీలో చేరిన ముషారఫ్.. చీఫ్గా పని చేశారు. 1999లో ఫెడరల్ ప్రభుత్వాన్ని కూల్చేసి సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కార్గిల్ యుద్దానికి ప్రధాన కారకుడు ఆయనే. పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్పై క్రిమినల్ చర్యలు సైతం చేపట్టారు.