పాకిస్తాన్ మరోసారి భారత్ పట్ల తన అసంతృప్తిని వెల్లగక్కింది. రంజాన్ సందర్భంగా పాకిస్తాన్లోని భారత హైకమిషన్ ఇచ్చిన విందుకు హాజరైన అతిథులతో అమర్యాదగా ప్రవర్తించారు ఆ దేశ భద్రతా సిబ్బంది
పాకిస్తాన్ మరోసారి భారత్ పట్ల తన అసంతృప్తిని వెల్లగక్కింది. రంజాన్ సందర్భంగా పాకిస్తాన్లోని భారత హైకమిషన్ ఇచ్చిన విందుకు హాజరైన అతిథులతో అమర్యాదగా ప్రవర్తించారు ఆ దేశ భద్రతా సిబ్బంది.
వివరాల్లోకి వెళితే.. రంజాన్ మాసం సందర్భంగా ఇస్లామాబాద్లోని సెరెనా హోటల్లో భారత హైకమిషన్ అధికారులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడంతో పలువురు అతిథులు వచ్చారు. అయితే భద్రతా కారణాల పేరు చెప్పి పాకిస్తాన్ భద్రతా దళాలు.. అతిథులను తీవ్రంగా వేధించారు.
వారికి అసహనం కలిగించడంతో పాటు ఓ అతిథి మీద చేయి కూడా చేసుకున్నారు. మరికొందరు అతిథుల కార్లను పార్కింగ్ స్థలం నుంచి తొలగించగా, మరికొందరి వాహనాలను హోటల్లోకి అనుమతించలేదు.
దీంతో కొందరు ముఖ్యులు విందుకు హాజరవ్వకుండానే వెళ్లిపోయారు. అతిథులకు జరిగిన అవమానానికి సంబంధించి పాక్లోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా క్షమాపణలు చెప్పారు.
ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవాలంటూ భారత్ దాయాది దేశంపై పదే పదే ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో గత కొన్ని నెలలుగా పాక్లోని భద్రతా సంస్థలు ఈ తరహాలో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయి.
ఇతర దేశస్థులు ఎవరైనా పాక్లో అడుగుపెట్టినా వారిని కూడా ఇదే విధంగా వేధింపులుకు గురిచేస్తున్నారు. రంజాన్ కావడంతో వారు మరింతగా రెచ్చిపోతున్నారు.