
పాకిస్తాన్కు అంతర్జాతీయంగా మరోసారి ఘోర అవమానం ఎదురైంది. పాకిస్తాన్పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్థాన్ను ఒకటిగా అభివర్ణించారు. శుక్రవారం డెమొక్రాటిక్ కాంగ్రెస్ ప్రచార కమిటీ రిసెప్షన్లో జో బైడెన్ మాట్లాడుతూ.. ఈ కామెంట్స్ చేశారు. ఈ మేరకు వైట్ హౌస్ ఒక ప్రకటనలో జో బైడెన్ కామెంట్స్ను ఉటంకించింది.
‘‘ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్తాన్ను ఒకటిగా నేను భావిస్తున్నాను. పాకిస్తాన్ ఏ విధమైన సమన్వయం లేకుండా అణ్వాయుధాలు కలిగి ఉంది’’ అని బైడెన్ పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ వివాదం గురించి, అది ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసిందనే అంశం గురించి మాట్లాడుతూ జో బైడెన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇతర దేశాలతో అమెరికా సంబంధాల గురించి కూడా ఆయన మాట్లాడారు.