
రాజకీయ సంక్షోభంలో ఇరుక్కుపోయిన పాక్ ప్రధాని ఇటీవల కాలంలో భారత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మన దేశ విధానాలు సందర్భానుసారం మెచ్చుకుంటున్నారు. కొన్నిరోజుల కిందట భారత విదేశాంగ విధానాన్ని, రక్షణ వ్యవహారాలను పొగిడిన ఆయన మళ్లీ భారత్ ను ఆకాశానికి ఎత్తేశారు. భారత్ కు ఏ అగ్రరాజ్యం షరతులు విధించదని అన్నారు. ప్రజల ప్రయోజనాల నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఏ పక్షం వహించకుండా నిరాకరించిందని, ఆ సమయంలో ఏ దేశం భారత్ కు అండగా నిలబడలేదని అన్నారు.
భారతదేశం నుంచి పాకిస్తాన్ ఆత్మ గౌరవం నేర్చుకోవాలని అన్నారు. భారత్ రష్యా, ఉక్రెయిన్ వైపు నిలబడకున్నా ఏ అగ్రరాజ్యం ఆ దేశంపై ఆంక్షలు విధించలేకపోయిందని అన్నారు. “ రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడాలని EU దౌత్యవేత్తలు పాకిస్థాన్ పై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. కానీ భారతదేశం సార్వభౌమాధికారం కలిగిన దేశం కాబట్టి వారు భారత్తో ఆ మాట చెప్పే ధైర్యం చేయలేకపోయారు ’’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. “ నేను కూడా మరో దేశం కోసం ప్రజలను చనిపోనివ్వలేను. మన విదేశాంగ విధానం సార్వభౌమాధికారంగా ఉండాలి ” అని ఆయన నొక్కి చెప్పారు.
నేడు నిర్వహించే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్కు ముందు తన దేశాన్ని ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం రాత్రి ప్రసంగిస్తూ.. ‘‘ నా రష్యా పర్యటనపై అమెరికా అసంతృప్తిగా ఉంది ’’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాక్ మిత్రదేశంగా ఉన్నప్పటికీ ఆ దేశం పాకిస్తాన్లో 400 డ్రోన్ దాడులను నిర్వహించిందని, ప్రతిపక్షం సహాయంతో తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చురుకుగా కుట్ర పన్నిందని ఇమ్రాన్ ఖాన్ అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూఎస్ పై తీవ్ర ఆరోపణలు చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తాను అమెరికా వ్యతిరేకి కాదని అన్నారు.
తనను గద్దె దింపినట్లయితే అప్పుడు మాత్రమే అమెరికా పాకిస్తాన్ను క్షమిస్తుందని ఒక అమెరికన్ ప్రతినిధి చెప్పారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అయితే ఈ విషయాలు మీడియాకు వెల్లడించలేనని, ఎందుకంటే అవి అత్యంత రహస్యమైనవని అన్నారు. అవి లీక్ అయితే పాకిస్తాన్ భద్రతకు ఎంతో ప్రమాదమని తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్దమని చెప్పింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాల్సిందేని చెప్పింది. అయితే ఈ తీర్పుపై కూడా ఇమ్రాన్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో ‘‘ దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని’’ తాను అంగీకరించబోనని ఆయన తేల్చిచెప్పారు. ‘‘ సుప్రీంకోర్టు కనీసం విదేశీ కుట్రకు సంబంధించిన సాక్ష్యాధారాలను పరిశీలించి, అభియోగాలపై దర్యాప్తునకు ఆదేశించి ఉండాల్సింది ’’ అని అన్నారు.
దిగుమతి చేసుకున్న ప్రభుత్వాలను తాను అంగీకరించేది లేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాశ్చాత్య ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగడం తాను ఎప్పుడూ చూడలేదని తెలిపారు. తను ప్రజల మధ్యకు వెళ్తానని అన్నారు. విదేశాలు పాకిస్థాన్ ను టిష్యూ పేపర్ లా ఉపయోగించకూడదని అన్నారు. కాగా నేటి ఉదయం 10 గంటలకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటు ఓటింగ్ జరగనుంది. పాకిస్థాన్ ఏర్పడిన 75 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి పూర్తి పదవీకాలం పూర్తి చేయలేదు.