
న్యూఢిల్లీ: చంద్రయాన్ 3 ల్యాండింగ్ గురించి భారత దేశమంతా ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్నది. గత చంద్రయాన్ 2 ల్యాండింగ్ ఫెయిల్ కావడంతో.. ఈ రోజు ల్యాండింగ్ కాబోతున్న చంద్రయాన్ 3 మిషన్ పై గురించే అందరు చర్చిస్తున్నారు. ఈ సారి మిషన్ సక్సెస్ కావాలని కొందరు పూజలు చేస్తుంటే.. మరికొందరు సక్సెస్ అవుతుందని పార్టీలు జరుపుకుంటున్నారు. ఇదంతా కేవలం భారత్కే పరిమితం కాలేదు. పొరుగు దేశం పాకిస్తాన్లోనూ చంద్రయాన్ 3 పై ఆసక్తి ఏర్పడింది. గతంలో విమర్శించినవారే.. ఇప్పుడు ప్రశంసలు చేస్తున్నారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచారం, ప్రసారాల శాఖకు మంత్రిగా పని చేసిన ఫవాద్ చౌదరి ఎక్స్లో చంద్రయాన్ 3 గురించి ట్వీట్ చేశారు. గతంలో ఆయన చంద్రయాన్ 2ను విమర్శించారు. కానీ, ఇప్పుడు చంద్రయాన్ 3కి తానే ఫ్యాన్ అన్నట్టుగా కామెంట్ చేశారు. పాకిస్తాన్లోనూ చంద్రయాన్ 3 ల్యాండింగ్ లైవ్ ఇవ్వాలని కోరారు.
సాయంత్రం 6.15 గంటలకు (పాకిస్తాన్ స్థానిక సమయం) చంద్రయాన్ 3 మూన్ ల్యాండంగ్ను పాకిస్తాన్ మీడియా కూడా లైవ్లో చూపెట్టాలని పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ ట్వీట్ చేశారు. ఇది మానవాళికి చారిత్రక సందర్భం అని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత అంతరిక్ష శాస్త్రవేత్తలకు, నిపుణులకు, ప్రజలకు గొప్ప సందర్భం అని తెలిపారు.
చంద్రయాన్ 2 సమయంలో ఇదే ఫవాద్ చౌదరి మన స్పేస్ మిషన్ను విమర్శించారు. చంద్రుడు కనిపిస్తాడు. ఆయన లొకేషన్ కూడా తెలుసు. ఏ టెర్రిరటరీ, దాని ఆల్టిట్యూడ్స్ ఏమిటో కూడా తెలుసు అని పేర్కొన్నారు. ఇందుకోసం ఇంతలా కష్టపడిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఆ తర్వాత ఆయనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. దీంతో.. చంద్రయాన్ 2 మిషన్ ఫెయిల్ కావడా నికి తానే కారణం అన్నట్టుగా ట్రోల్స్ చేస్తున్నారని మరో ట్వీట్ చేశారు. కానీ, దీని కోసం రూ. 900 కోట్లు ఖర్చు పెట్టారనే తాను అన్నట్టు పేర్కొన్నారు.