మృత్యుంజయురాలు ఈ చిన్నారి.. నాలుగు రోజులుగా శిథిలాల కింద...

By AN TeluguFirst Published Nov 4, 2020, 9:20 AM IST
Highlights

నాలుగు రోజులకింద టర్కీని వణికించిన ఇజ్మీర్ భూకంపం ఎంతోమందిని కట్టుబట్టలతో మిగిల్చింది. మరెంతో మందిని అనాధలుగా మార్చేసింది. అయితే ఈ భూకంపంలో శిథిలాల కింద ఓ మూడేళ్ల చిన్నారి క్షేమంగా బయటపడింది. నాలుగు రోజులుగా బిక్కుబిక్కు మంటూ ఉన్న ఈ చిన్నారిని సహాయక బృందాలు కాపాడాయి. 

నాలుగు రోజులకింద టర్కీని వణికించిన ఇజ్మీర్ భూకంపం ఎంతోమందిని కట్టుబట్టలతో మిగిల్చింది. మరెంతో మందిని అనాధలుగా మార్చేసింది. అయితే ఈ భూకంపంలో శిథిలాల కింద ఓ మూడేళ్ల చిన్నారి క్షేమంగా బయటపడింది. నాలుగు రోజులుగా బిక్కుబిక్కు మంటూ ఉన్న ఈ చిన్నారిని సహాయక బృందాలు కాపాడాయి. 

సహాయక బృందాలు అందర్నీ కాపాడాం.. శిథిలాల కింద ఇంకెవ్వరూ మిగిలిఉండరని అనుకుంటున్న టైంలో కుప్పకూలిపోయిన ఓ అపార్ట్‌మెంట్‌ శిథిలాల కింద ఓ చిన్నారి  ప్రాణాలతో ఉండడం అందర్నీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచేసింది. ప్రాణాలతో ఉన్న మూడేళ్ళ చిన్నారి ఐదా గెజ్‌గిన్‌ని సహాయక బృందాలు వెలికితీసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 

శుక్రవారం భారీ భూకంపం సంభవించినప్పటి నుంచి 91 గంటల పాటు ఈ చిన్నారి శిథిలాల కింద చిక్కుకుపోయింది. ఐదా గెజ్‌గిన్‌ తల్లి ఈ ప్రమాదంలో మరణించింది. ఈ భూకంపం సంభవించినప్పుడు ఐదా తండ్రి, సోదరుడు ఆ భవనంలో లేరు. 

ఎనిమిది అంతస్తుల ఈ భవనం శిథిలాలను తొలగిస్తుండగా ఓ చిన్నారి ఏడుపు వినిపించడంతో అందర్నీ నిశ్శబ్దంగా ఉండమని చెప్పి పాపాయి కోసం వెతగ్గా డిష్‌వాషర్‌ పక్కన ఈ చిన్నారిని కనుగొన్నట్టు ఈ పాపను కాపాడిన నస్రత్‌ అక్సోయ్‌ చెప్పారు. 

భవనం శిథిలాలను వెలికితీస్తుండగా, చాలా బలహీనంగా ఉన్న ఈ చిన్నారి తాను ఇక్కడ ఉన్నానని చెప్పేందుకు ప్రయత్నించింనట్టు వారు చెప్పారు. చిన్నారి పిలుపు వినగానే శిథిలాలను తొలగించే మెషీన్‌ను ఆపి శబ్దం వచ్చిన వైపు వెళ్ళి చూడగా ‘ఇక్కడ ఉన్నాను’ అని చెప్పడం చూసి ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకున్నాయని నస్రత్‌ తెలిపారు. చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆ అమ్మాయి తన తల్లి ఏదని అడిగినట్లు వారు తెలిపారు. 

click me!