
Nupur Sharma Controversy: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ మరోసారి కోల్కతా పోలీసుల ఎదుట హాజరుకాలేదని అధికారులు వెల్లడించారు. శర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఈ నేపథ్యంలో తాను ఇలాంటి పరిస్థితిలో విచారణకు హాజరు కాలేననీ, అధికారుల ముందు హాజరయ్యేందుకు నాలుగు వారాల గడువు కోరారు. ఈ మేరకు అమ్హెర్స్ట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు ఇ-మెయిల్ ద్వారా ఈ సమాచారం అందించారు.
ఈ వారం ప్రారంభంలో కూడా అదే కారణాలను పేర్కొంటూ నార్కెల్దంగ పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించింది. జూన్ 20న నూపుర్ శర్మను నార్కెల్దంగా పోలీస్ స్టేషన్కు రావాలని సమన్లు జారీ చేశారు. అయితే.. నుపుర్ శర్మ నుండి తమకు ఓ ఇమెయిల్ వచ్చిందనీ, అందులో ఆమె అమ్హెర్స్ట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ అధికారుల ముందు హాజరుకావడంలో తన అసమర్థతను వ్యక్తం చేసిందని పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణలో హాజరుకావడానికి తనకు నాలుగు వారాల గడువు కావాలని సమయం కోరారు. తాను కోల్కతాకు వస్తే.. తనపై దాడి జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. ఆమె తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
జూన్ 4న పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ నేతపై కేసులు నమోదు కావడం గమనార్హం. నుపుర్ శర్మ ఓ టీవీ ఛానెల్లో చర్చ సందర్భంగా.. ప్రవక్త మొహమ్మద్పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీని కారణంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు కూడా తెరపైకి వచ్చాయి. ప్రవక్తకు వ్యతిరేకంగా నుపుర్ శర్మ చేసిన ప్రకటన తర్వాత పశ్చిమ బెంగాల్లోని హౌరా, నదియా, ముర్షిదాబాద్ జిల్లాల్లో హింసాత్మక నిరసనలు జరిగాయి.
మహ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారంటూ.. శర్మను బీజేపీ సస్పెండ్ చేసింది. శర్మ కూడా తన ప్రకటనను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పారు. అయితే, ఆమెపై పోలీసు చర్యలు తీసుకోవాలని ముస్లిం సంఘాలు, నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కోల్కతా పోలీసులు నూపుర్ శర్మకు సమన్లు జారీ చేశారు.