
జింబాబ్వే : జింబాబ్వేలో మీజిల్స్ విలయం సృష్టిస్తోంది. ఈ వ్యాధి బారిన పడి ఇటీవల 698 మంది చిన్నారులు మృత్యువాత పడినట్లు జింబాబ్వే ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా టీకాను తప్పనిసరి చేయాలని.. ఇందుకు సంబంధించి చట్టాన్ని సవరించాలని డిమాండ్ మొదలైంది. మరోవైపు భారీ స్థాయిలో నమోదవుతున్న మీజిల్స్ కేసులు, మరణాలపై అటు ఐక్యరాజ్య సమితి విభాగం యూనిసెఫ్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. జింబాబ్వేలోని మనికాల్యాండ్ ప్రావిన్సులో ఏప్రిల్ తొలివారంలో మీజిల్స్ వ్యాధిని గుర్తించారు.
ఆ తర్వాత కొన్ని వారాల్లోనే దేశవ్యాప్తంగా ఇది వ్యాపించింది. ఇప్పటి వరకు 6291 కేసులు నమోదు కాగా, 698 మంది చిన్నారులు మృత్యువాత పడినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. కానీ కేవలం సెప్టెంబర్ 1వ తేదీన ఒక్కరోజే 37మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. రెండు వారాల క్రితం కేవలం 157 మరణాలే ఉండగా.. తాజాగా ఆ సంఖ్య నాలుగు రెట్లు పెరగడం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది.
వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్లే…
మత విశ్వాసాల కారణంగా అక్కడ చాలా కుటుంబాలు వ్యాక్సింగ్ కు దూరంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల మరణించినవారిలో వ్యాక్సిన్ తీసుకోనివారే అధికంగా ఉన్నట్లు ఆ దేశ సమాచార శాఖ మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ను తప్పనిసరి చేయాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. టీకాను తిరస్కరించే వర్గాలే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు పెంచాలని అక్కడ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జోహన్నస్ మారిసా పేర్కొన్నారు ఆరు నెలల నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు టీకాలు తప్పనిసరిగా ఇవ్వాలి అని అన్నారు.
ప్రపంచంలో అధికంగా వ్యాపించే అంటువ్యాధుల్లో మీజిల్స్ కూడా ఒకటి. దగ్గు, తుమ్మడం, సన్నిహితంగా మెలగడం వల్ల ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దగ్గు, జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీజిల్స్ వ్యాక్సిన్ తీసుకోని పిల్లల్లో ఈ లక్షణాలు ఎక్కువై మరణం కూడా సంభవిస్తుంది. ముఖ్యంగా పోషకాహారం లోపంతో బాధపడే చిన్నారుల్లో వ్యాధి వ్యాధి అధికంగా ఉంటుంది.