
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్ మరింత రక్తసిక్తంగా మారుతున్నది. గత రెండు దశాబ్దాలుగా ఎడతెగని రక్తపాతంతో వణికిన ప్రజలు ఇకపై మరింత రక్తమోడే ముప్పు ఉన్నట్టు తెలుస్తున్నది. అటు అమెరికా సహా పాశ్చాత్య దేశాలకు, ఇటు తాలిబాన్లకు శత్రువుగా ఉన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ను లక్ష్యం చేసుకుంటున్నారు.
గురువారం సాయంత్రం కాబూల్ ఎయిర్పోర్టు దగ్గర రెండు పేలుళ్లు దేశాన్ని కుదిపేసింది. పేలుడు దాటికి మానవ మృతదేహాలు, విడి భాగాలు గాల్లోకి ప్లాస్టిక్ కవర్లుగా ఎగిరాయి. విమానాశ్రయం సమీపంలోని కెనాల్ కాలువ నెత్తురుతో నిండింది. ప్రత్యక్ష సాక్షులు హతాశయులయ్యారు. ఇంకా ఆ క్షణాల నుంచి కోలుకోవడం లేదు. ఈ ఘటనలో మరణాల సంఖ్య శుక్రవారం ఉదయానికి 103కు చేరింది. ఇందులో అఫ్ఘాన్ పౌరులతోపాటు అమెరికా ఆర్మీ సిబ్బంది, తాలిబాన్లూ ఉన్నారు. కనీసం 18 మంది తాలిబాన్ సభ్యులు మరణించారు. 13 మంది అమెరికన్ సోల్జర్లు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. కనీసం 90 మంది అఫ్ఘాన్ సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
సిరియా కేంద్రంగా ఉన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్టు ప్రకటించుకుంది. తమ సూసైడ్ బాంబర్ ఆత్మహుతితో పేలుడు జరిగిందని వివరించింది. ఐఎస్ఐఎస్ పేలుళ్లను తాలిబాన్లూ ఖండించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించారు. రెండు పేలుళ్లకు బాధ్యులను విడిచేది లేదని స్పష్టం చేశారు. కౌంటర్ అటాక్కు ప్రణాళిక సిద్ధం చేయమని పెంటగాన్ను ఆదేశించారు.